ఇన్వెస్టర్లకు ఊపిరి: కోలుకున్న స్టాక్ మార్కెట్స్: భారీ లాభాలతో ట్రేడింగ్
ముంబై: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఊహించినట్టే యుద్ధం ఆరంభమైంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దూకుడు చూస్తోంటే ఉక్రెయిన్ను తన దారికి తెచ్చుకునేంత వరకూ యుద్ధాన్ని కొనసాగించేలా ఉన్నారు. తొలి రోజు- ఉక్రెయిన్పై రష్యా ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్టేన. ఉక్రెయిన్కు చెందిన కొన్ని కీలక పట్టణాలు రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయాయి. రష్యా సైనికులు వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉక్రెయిన్ సైన్యానికి చెంది పలు ప్రాంతాలను ఆక్రమించుకున్నారు.
1,300 పాయింట్లతో..
ఒకవంక రెండో రెజు కూడా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్నప్పటికీ.. దేశీయ స్టాక్ మార్కెట్స్ పుంజుకొన్నాయి.. నిలదొక్కుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా లాభపడ్డాయి. గురువారం నాటితో పోల్చుకుంటే- ఇవ్వాళ సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ట్రేడింగ్ను నమోదు చేసుకున్నాయి. సెన్సెక్స్ 1,300, నిఫ్టీ 352.60 పాయింట్ల మేర లాభపడ్డాయి. దీనితో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత కూడా ఎక్కడా మార్కెట్ లోయర్ సర్కుట్లో ట్రేడ్ కాలేదు.
గ్రాఫ్ పైపైకి..
ఇంట్రాడే మొత్తం ఇలాగే ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లల్లో పతనం కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు భావించినప్పటికీ- దానికి పూర్తి భిన్నమైన వాతావరణం కనిపించింది. దాదాపు అన్ని సెగ్మెంట్స్కు సంబంధించిన షేర్లన్నీ పాజిటివ్లో ట్రేడింగ్ అయ్యాయి. కిందటి రోజు పాతాళానికి పడిపోయిన షేర్ల గ్రాఫ్.. ఇవ్వాళ పైపైకి కొనసాగుతూ కనిపించాయి. అన్ని రంగాలకు సంబంధించిన షేర్లు పెరుగుదల బాట పట్టాయి.
బ్యాంకింగ్..
తొలి గంట ట్రేడింగ్లో టాటా స్టీల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. కిందటి రోజు ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఆరు శాతం వరకు ఈ బ్యాంక్కు చెందిన షేర్ల విలువ క్షీణించింది. ఇవ్వాళ ఆ పరిస్థితి లేదు. బ్యాంకింగ్, ఆటోమొబైల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియాలిటీ, మౌలికం రంగాల షేర్లన్నీ ఫర్వాలేదనిపించుకుంటోన్నాయి. సాయంత్రం వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందనే విశ్వాసం మార్కెట్ వర్గాల్లో నెలకొంది.
లాభపడ్డ షేర్లు ఇవే..
ఈ రెండింటితో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తొలి గంటలో లాభపడ్డాయి. కిందటి రోజుతో పోల్చుకుంటే నాలుగు శాతం మేర వాటి షేర్లు పెరిగాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సెగ్మెంట్స్కు చెందిన షేర్లు లాభపడటంతో వాటిల్లో పెట్టుబడి పెట్టిన రిటైల్ ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. మళ్లీ సోమవారం నాడు స్టాక్ మార్కెట్లో ఇదే పాజిటివ్ ట్రేడింగ్ ఉండొచ్చని ఆశిస్తున్నారు.
తొలి రోజు భారీగా పతనం..
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తొలి రోజు సెన్సెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఆరంభంలోనే 1,400 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్.. సాయంత్రానికి 2,702 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ 800 పాయింట్లకు పైగా నష్ట పోయింది. ఫలితంగా 13 లక్షల కోట్ల రూపాయల మేర సంపదను ఇన్వెస్టర్లు కోల్పోవాల్సి వచ్చింది. రెండోరోజు కూడా ఇవే పరిస్థితులు ఉండొచ్చని భావించినప్పటికీ- ఆ పరిస్థితి లేకపోవడం ఊరట ఇచ్చినట్టయింది.