జయ మృతి తర్వాత రాజకీయ ప్రకంపనలు: శశికళను కలుస్తారా.. గవర్నర్కు స్టాలిన్ లేఖ
దివంగత జయలలిత నెచ్చెలి శశికళపై డిఎంకే నేత స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శికళను అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సులర్లు కలిశారు. దీనిపై స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
చెన్నై: జయలలిత మృతి అనంతరం తమిళనాడు రాజకీయం ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఆమె మృతి తర్వాత పార్టీ, ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు శశికళ పావులు కదుపుతున్నారు. పన్నీరు పదవి నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు బీజేపీ తమిళనాట పట్టు కోసం ఇదే సమయమని చూస్తోంది. ఇంకోవైపు, ప్రస్తుత పరిస్థితులను క్యాష్ చేసుకునేందుకు విపక్ష డీఎంకే ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు ఐటీ దాడులు, రామ్మోహన్ రావును సీఎస్గా తొలగించడం, కొత్త సీఎస్ రావడం.. ఇలా వేగంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జయలలిత మృతి పైన ఇంకా అనుమానాలు తొలగిపోలేదు.

తాజాగా, దివంగత జయలలిత నెచ్చెలి శశికళపై డిఎంకే నేత స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగేతరశక్తిగా శశికళ వ్యవహరిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శశికళను అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సులర్లు కలిశారు. దీనిపై స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
తమిళనాడు ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర రావుకు డీఎంకే కోశాధికారి స్టాలిన్ గురువారం లేఖ రాశారు. రాష్ట్రంలోని పది యూనివర్సిటీల వైస్ చాన్సులర్లు శశికళను కలవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవిలో లేని వ్యక్తిని వీసీలు ఎలా కలుస్తారని లేఖలో ప్రశ్నించారు. జయలలిత స్థానంలోకి రావాలని ఎలా కోరుతారన్నారు. విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టకుండా చూడాలని కోరారు.
కాగా, జయలలిత మరణంతో ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు ఖాళీ అయ్యాయి. ముఖ్యమంత్రి పీఠం పైన పన్నీరు సెల్వంను కూర్చుండబెట్టారు. గతంలో జయలలిత రెండుసార్లు జైలుకు వెళ్లినప్పుడు పన్నీరు సెల్వం సీఎం పీఠంపై కూర్చున్నారు. ఆమె తిరిగి వచ్చాక పదవిని అప్పగించారు.
మరోవైపు, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి జయలలిత నెచ్చెలి శశికళకే అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. పన్నీర్ సెల్వం సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతిరోజూ పోయెస్ గార్డెన్ కు వెళ్లి శశికళ దర్శనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు అధికారులు శశికళను కలవడంపై డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications