ఆపండి మీ సోది వాగుడు.. సమగ్ర నివేదిక ఇవ్వండి..! కర్ణాటక పరిణామాలపై రాహుల్ సీరియస్..!!
బెంగళూరు: కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వ అస్థిరతకు దారి తీస్తున్న పరిస్థితులపై సమగ్ర నివేదిక అందించాలని రాహుల్ చేసిన సూచనతో అంతర్గత పోరుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ సందర్భంగా మాజీ సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ, సీఎం పదవిపై కామెంట్లు విసరడం ఇకపై సమసిపోతుందన్నారు. హుబ్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్ అధ్యక్షులు హెచ్.విశ్వనాథ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించబోనన్నారు. బహిరంగంగా ఇలాంటి అంశాలపై చర్చించడం సరికాదన్నారు.
కర్ణాటకలో రాజకీయ ప్రేలాపణలు..! అసహనం వ్యక్తం చేసిన రాహుల్..!!
మరోవైపు ముఖ్యమంత్రి కుమారస్వామి నేరుగా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఫోన్ చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. విశ్వనాథ్ వ్యాఖ్యలతో బేజారు కావద్దని నచ్చజెప్పారు. నిజానికి ఆయన సహకారం లేకుండా తాను సంకీర్ణ ప్రభుత్వం నడుపలేనని, ఇదిముమ్మాటికి పచ్చినిజం అంటూ సిద్దరామయ్యను శాంతపరిచే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం బాగానే ఫలించిందని చెప్పొచ్చు.
సంకీర్ణ ప్రభుత్వ అస్థిరతకు కారణం కావొద్దు..! నేతలకు క్లాస్ పీకిని రాహుల్..!!
ఇది జరిగిన కొద్దిసేపటికే సీఎం ఎవరు? అనే చర్చ అప్రస్తుతం అంటూ సిద్దరామయ్య స్వయంగా ఒక ప్రకటన చేశారు. కుందగోళ, చించోళి శాసనసభ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య హుబ్లిలోనే ఉన్నప్పటికీ పరస్పరం భేటీ కాలేదు. ఈ విభేదాలను మరిచిపోయి ముఖ్యనేతలందరూ ఏక తాటిపైకి రావాలని రాహుల్ గాంధీ సూచించారు.
నేతల మద్య సఖ్యత అవసరం..! ఆరోపణలు ఆపాలన్న రాహుల్..!!
అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి రోజురోజుకూ దారితప్పుతున్న వైనంతో కలత చెందిన మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ సూచనతోనే కుమారస్వామి ఒక మెట్టు దిగి సిద్దరామయ్యతో టెలిఫోన్లో సంభాషించినట్లు తెలుస్తోంది. ఈ చర్చల అనంతరం జేడీఎస్ ఎమ్మెల్యేలను కుమారస్వామి నియంత్రించేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సిద్దరామయ్య నియంత్రించేలా ఒక అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది.
సీఎం పదవి గురించి నోరు మెదపొద్దు..! గట్టి వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ చీఫ్..!!
మే 23 లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు ఎవరూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని ప్రత్యేకించి ముఖ్యమంత్రి పదవికి సంబంధించి అసలు నోరు మెదపరాదని ప్రత్యేక సూచనలు వెళ్ళినట్టు తెలుస్తోంది. విశ్వనాథ్ వ్యాఖ్యలతో అల్లోలకల్లోలంగా మారిన సంకీర్ణ పాలనను గాడిన పెట్టేందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఈ చర్యలు ఎంతకాలం పనిచేస్తాయో వేచి చూడాలి.