అవి హత్యలే: ఆక్సిజన్ కొరత కరోనా మరణాలపై రాహుల్ గాంధీ వీడియో ట్వీట్
న్యూఢిల్లీ: హర్యానాలోని గురుగ్రామ్ ఆస్పత్రిలో ఆరుగురు కరోనా రోగులు ఆక్సిజన్ కొరత కారణంగా మృతి చెందారు. ఆ ఆస్పత్రిలోని మృతులకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు రాహుల్ గాంధీ. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలేనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చనిపోయినవారి కుటుంబసభ్యులకు రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. కరోనాను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
కాగా, ఆక్సిజన్ కొరత కారణంగా పలు రాష్ట్రాల్లో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. తమిళనాడులోని చెంగల్పట్టులో మంగళవారం రాత్రి 13 మంది కరోనా రోగులు మృతి చెందారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో ఇప్పటికే ఆక్సిజన్ కొరత కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు.
This is murder. And cover up!
— Rahul Gandhi (@RahulGandhi) May 5, 2021
My condolences to the families of the victims. pic.twitter.com/md3tNWp1bZ
మరోవైపు మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కరోనా పరీక్షలు తగ్గించడం వల్లే కొత్త కేసులు కూడా తగ్గాయని ఆయన పేర్కొన్నారు.