ఇద్దరు విద్యార్థుల మధ్య వాగ్వాదం... చివరకు : గుజరాత్లో మత ఘర్షణలు
గుజరాత్లో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు విద్యార్థుల మధ్య మొదలైన వాగ్వాదం చివరకు మూడు ఊర్ల మధ్య ఘర్షణలకు దారి తీసింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పదిమందికి పైగా గాయపడ్డారు.
అహ్మదాబాద్: గుజరాత్లో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు విద్యార్థుల మధ్య మొదలైన వాగ్వాదం చివరకు మూడు ఊర్ల మధ్య ఘర్షణలకు దారి తీసింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పదిమందికి పైగా గాయపడ్డారు.
ఆందోళనకారులు 50 ఇళ్లకు నిప్పు పెట్టారు. పలు వాహనాలు తగులబెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఏడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.
ఈ ఘటన గుజరాత్లోనని పటాన్ జిల్లాలో శనివారం జరిగింది. మృతి చెందిన ఇద్దరిలో ఒకరు పోలీసు కాల్పుల్లో చనిపోగా, మరొకరు ఘర్షణలో చనిపోయారు. చనసానా పోలీస్ స్టేషన్ పరిధిలో పడవలి గ్రామంలో ఇద్దరు విద్యార్థుల మధ్య చిన్న వాగ్వాదం తలెత్తింది.
ఇది మత ఘర్షణలకు దారి తీసింది. జీ చౌహాన్ అనే 50 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. దీంతో ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఆందోళనకారులు పరస్పరం ఇళ్లకు నిప్పు పెట్టుకున్నారు.
పటాన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశ్విన్ చౌహాన్ మాట్లాడుతూ... ఇద్దరు మైనర్ల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ఈ ఘర్షణకు దారి తీసిందన్నారు. వారు స్కూల్కు వెళ్తున్న సమయంలో జరిగిందని చెప్పారు. ఈ ఘర్షణ మూడు గ్రామాలకు పాకిందన్నారు.