గౌరీ లంకేష్ వారసులెవరు?: పత్రిక నడుస్తుందా!, భవిష్యత్తుపై అనుమానాలు..
ఒకవేళ పత్రిక కొనసాగినా లంకేష్ వారసులుగా సంపాదకత్వం బాధ్యతలు ఎవరు స్వీకరించబోతున్నారు? అన్నది కూడా ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.
బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ దారుణ హత్య దేశవ్యాప్తంగా పాత్రికేయ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రశ్నించే గొంతుకులను అణచివేయాలని చూయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని లౌకికవాదులు ముక్తం కంఠంతో ఈ ఘటనను ఖండిస్తున్నారు.
ఇదిలా ఉంటే, గౌరీ హత్య నేపథ్యంలో ఆమె నిర్వహిస్తున్న గౌరీ లంకేష్ పత్రిక ఉనికిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వారం ఎడిషన్ ఆగిపోవడంతో మున్ముందు పత్రిక భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ పత్రిక కొనసాగినా లంకేష్ వారసులుగా సంపాదకత్వం బాధ్యతలు ఎవరు స్వీకరించబోతున్నారు? అన్నది కూడా ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.
పత్రిక భవిష్యత్తుపై చర్చించేందుకు శుక్రవారం బసవగుడిలోని పత్రిక ప్రధాన కార్యాలయంలో టాబ్లాయిడ్ ఎడిటోరియల్ సభ్యులు సమావేశమయ్యారు. అయితే సెప్టెంబర్ 12న నిర్వహించ తలపెట్టిన 'నాను గౌరీ(నేను గౌరీ)' స్మారక సభ ఏర్పాట్ల గురించే తాము చర్చించామని, ఇతర విషయాలు చర్చకు రాలేదని వారు తెలిపారు.
ఏడుగురు ఉద్యోగులతో:
ప్రస్తుతం లంకేష్ పత్రికలో ఏడుగురు ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు పార్ట్ టైమ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. గౌరీ మేడమ్ కుటుంబ సభ్యులతో చర్చించాకే పత్రికా భవిష్యత్తుపై నిర్ణయం ప్రకటిస్తామని గిరీశ్ తల్లికట్టే తెలిపారు. గౌరీ నిర్వహించిన ఉద్యోగ అనే సంచికకు గిరీశ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు.
ఇప్పుడే చెప్పలేం:
గౌరీ కుటుంబ సభ్యులు ప్రస్తుతం షాక్ లో ఉన్నారు. వారు తేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. సన్నిహితులు, స్నేహితులు మాత్రం పత్రిక కొనసాగాలని కోరుకుంటున్నారు. అయితే కార్యరూపం దాల్చడానికి మరికొంత సమయం పడుతుంది.' అని సతీష్ అనే మరో ఉద్యోగి తెలిపారు. 2005లో గౌరీ కుటుంబ సభ్యులు మధ్య బేధాభిప్రాయాలు వచ్చినప్పుడు సతీష్ గౌరీ వెంట నిలిచారు.
టాబ్లాయిడ్ భవిష్యత్తు అనుమానమే:
పబ్లికేషన్ కాలమిస్ట్, గత 37ఏళ్లుగా గౌరీ కుటుంబాన్ని దగ్గరిగా ఎరిగిన చంద్రే గౌడ మాత్రం టాబ్లాయిడ్ భవితవ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణానికి పత్రికే కారణమనే అభిప్రాయంలో కుటుంబ సభ్యులు ఉన్నారని, అలాంటప్పుడు దాన్ని వారు కొనసాగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అన్నారు. గతంలోను టాబ్లాయిడ్ పబ్లిషింగ్ కు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని, ఆ సమయంలో దాని భవిష్యత్తుపై తనకు అనుమానాలు కలిగాయని అన్నారు.
హిందుత్వ శక్తుల సింహ స్వప్నం:
హిందుత్వ శక్తులకు సింహ స్వప్నంగా మారిన లంకేష్ పత్రిక ఎట్టి పరిస్థితుల్లోను తిరిగి కొనసాగుతుందని గౌరీ లంకేష్ సన్నిహితులు శివ సుందర్ చెబుతున్నారు. హిందుత్వ ఆగడాలకు వ్యతిరేకంగా కథనాలు రాసినందుకే ఆమెకు బెదిరింపులు ఎదురయ్యాయని, ఈ క్రమంలోనే ఆమె హత్య జరిగిందని సుందర్ ఆరోపించారు.