యుపి గవర్నర్ జోషీ రిజైన్: అదే బాటలో మరికొందరు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ గవర్నర్ బిఎల్ జోషీ తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. యూపిఏ ప్రభుత్వం నియమించిన గవర్నర్లు రాజీనామా చేయాలని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కోరనుందనే వార్తలు వెలువడిన నేపథ్యంలోనే బిఎల్ జోషి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. జోషీ బాటలోనే మరో నలుగురు గవర్నర్లు కూడా ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం వర్గాల సమాచారం మేరకు కేంద్ర హోంశాఖ సెక్రటరీ అనీల్ గోస్వామి ఏడు రాష్ట్రాల గవర్నర్లు తమ పదవికి రాజీనామా చేయాల్సిందిగా కోరినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే మొదటగా ఉత్తరప్రదేశ్ గవర్నర్ జోషీ రాజీనామా చేసినట్లు తెలిసింది. ఆ ఏడుగురు గవర్నర్లలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకె నారాయణ, కేరళ గవర్నర్ షీలా దీక్షిత్, రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ అల్వా, గుజరాత్ గవర్నర్ కమలా బేణీవాల్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ బిఎల్ జోషీ, మహారాష్ట్ర గవర్నర్ శంకరనారాయణ్, త్రిపుర గవర్నర్ దేవేంద్ర కొన్వర్లు ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించే అవకాశం ఉంది. కాగా, ఏడు రాష్ట్రాల గవర్నర్లు మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసే అవకాశాలున్నాయి.
ఇది ఇలా ఉండగా రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ అల్వా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. రాజీనామాపై ఈ ఈ భేటీలో చర్చించే అవకాశాలున్నాయి. తాను రాజీనామా చేయబోనని కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ తెలిపినట్లు సమాచారం. ఆమె పుకార్లు నమ్మనని చెప్పారు. కాగా, తమిళనాడు, కర్ణాటక గవర్నర్ల జోలికి ఎన్డీఏ సర్కారు వెళ్లలేదు. ప్రభుత్వాలు మారితే గవర్నర్ల మార్పు సహజమేనని ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా, బిజెపి సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మంగళవారం మాట్లాడుతూ.. గవర్నర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కోరారు. యుపిఏ హయాంలో రాజకీయ లబ్ధి కోసమే గవర్నర్ల నియామకం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విధేయులే గవర్నర్లుగా నియామకం అయ్యారని తెలిపారు.