బెంగళూరు జైలుకు శశికళ: పెరోల్ నియమాలు ఉల్లంఘించారని, భర్త కోసం వచ్చి రాజకీయాలు !
అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ నటరాజన్ పెరోల్ గడుపు ముగియడంతో ఆమె తిరిగి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు బయలుదేరారు.
చెన్నై/బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ నటరాజన్ పెరోల్ గడుపు ముగియడంతో ఆమె తిరిగి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు బయలుదేరారు. గురువారం ఉదయం చెన్నైలోని టీ నగర్ లోని మేనకోడలు క్రిష్ణ ప్రియ ఇంటి నుంచి శశికళ బెంగళూరు బయలుదేరారు.
శశికళ వెంట ఆమె బంధువులు, సన్నిహితులు ప్రత్యేక వాహనాల్లో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు వరకు తోడుగా బయలుదేరారు. చెన్నై నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గంలో వస్తున్న శశికళకు తమిళనాడు, కర్ణాటక పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
పెరోల్ నియమాలు గాలికి !
గురువారం సాయంత్రం 5 గంటలలోపు శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చేరుకోవాలని ఇప్పటికే అధికారులు సూచించడంతో తప్పనిసరి పరిస్థితులో శశికళ నిరాశగా తిరుగుముఖంపట్టారు. కర్ణాటక జైళ్ల శాఖ అధికారుల ఆదేశాలను శశికళ గాలికి వదిలేశారని ఆరోపణలు ఉస్తున్నాయి.
భర్త దగ్గర ఉంటానని !
పెరోల్ నియమాలను శశికళ తుంగలో తొక్కేశారని తమిళ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఆసుపత్రిలో భర్త నటరాజన్ దగ్గర ఉండటానికి శశికళకు పెరోల్ మంజూరు చేశారు. రాజకీయాలు మాట్లాడకూడదని, బంధువులను మినహా ఇతరులను కలవకూడదని కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు షరతులు విధించారు.
ఆసుపత్రిలో కొన్ని గంటలు మాత్రమే
శశికళ రెండు రోజులు మాత్రమే గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రి చేరుకుని భర్త నటరాజన్ ను పరామర్శించారని తమిళ మీడియా అంటోంది. రెండు రోజుల్లో కేవలం నాలుగైదు గంటలు మాత్రమే శశికళ ఆసుపత్రిలో భర్త నాటరాజన్ దగ్గర ఉన్నారని, తరువాత మేనకోడలు క్రిష్ణ ప్రియ ఇంటి నుంచి ఆమె రాజకీయాల గురించి చర్చించారని ఆరోపణలు వస్తున్నాయి.
మంత్రులు, ఎమ్మెల్యేలకు ఫోన్ ?
పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కొందరు మంత్రులతో శశికళ ఫోన్ లో మాట్లాడారని సమాచారం. టీటీవీ దినకరన్, దివాకరన్ తో పాటు న్యాయనిపుణులతో శశికళ నటరాజన్ బిజీబిజీగా గడిపారని తమిళ మీడియా గురువారం వార్తలు ప్రసారం చేసింంది.
వివరాలు సేకరిస్తున్న కర్ణాటక
శశికళ వ్యవహారం తెలుసుకున్న కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారని తెలిసింది. శశికళ పెరోల్ నియమాలు ఉల్లంఘించారని వెలుగు చూస్తే మరోసారి ఆమెకు పెరోల్ మంజూరు అయ్యే అవకాశం లేదని న్యాయనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.