ఇక ఇప్పుడేం జరగబోతోంది? పన్నీరా? శశికళా? గవర్నర్ ఎవరివైపు మొగ్గుచూపుతారు?
ఇప్పుడు తమిళనాడు సీఎం పీఠం శశికళకు దక్కుతుందా? లేక తన రాజీనామాను వెనక్కి తీసుకుని బీజేపీ, డీఎంకేల మద్దతుతో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పీఠాన్ని తిరిగి అధిరోహిస్తారా?
చెన్నై: తమిళనాట రాజకీయం రసకందాయంలో పడింది. అన్నాడీఎంకే చీఫ్ శశికళ నటరాజన్ పై పన్నీర్ సెల్వం తిరుగుబాటు నేపథ్యంలో కొంత అయోమయం కూడా నెలకొందనే చెప్పాలి.
తనచే బలవంతంగా సీఎం పదవికి రాజీనామా చేయించారని, ప్రజలు, పార్టీ నాయకులు కోరుకుంటే తాను తన రాజీనామాను ఉపసంహరించుకుంటానంటూ మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయాక పన్నీర్ చేసిన ఆరోపణ తమిళనాడులో రాజకీయ సంక్షోభాన్నే సృష్టించింది.
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ నిజంగానే పన్నీర్ సెల్వంకు మార్గనిర్దేశం చేసిందా? అన్నాడీఎంకే పార్టీ కోశాధికారి పోస్టు నుంచి పన్నీర్ సెల్వంను ఆ పార్టీ చీఫ్ శశికళ ఇప్పటికే తొలగించిన నేపథ్యంలో ఆయనకు ఎంత మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలుస్తారు?
అన్నీ ప్రశ్నలే...
ఇప్పుడు తమిళనాడులో ఏం జరగబోతుందనే విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీఎం పీఠం శశికళకు దక్కుతుందా? లేక తన రాజీనామాను వెనక్కి తీసుకుని బీజేపీ, డీఎంకేల మద్దతుతో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పీఠాన్ని తిరిగి అధిరోహిస్తారా?
ఇటువంటి రాజ్యాంగ సంక్షోభ సమయంలో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు పాత్ర ఎలా ఉండబోతోంది? ఆయన ఎవరివైపు మొగ్గుచూపుతారు? పన్నీర్ సెల్వం రాజీనామాను గవర్నర్ ఇప్పటికే ఆమోదించిన నేపథ్యంలో.. తిరిగి ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకునే అవకాశం ఉందా? లేకపోతే తమిళనాడులో అధ్యక్ష పాలన విధించే అవకాశముందా?? రాజ్యాంగ బద్ధంగా ఉన్న అవకాశాలు ఏమిటో చూద్దాం...
రాజీనామా ఉపసంహరణకు అవకాశముందా?
పన్నీర్ సెల్వం తన రాజీనామాను ఉపసంహరించుకునే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తోంది. గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి ఎలాంటి ఒత్తిళ్ల నడుమ తాను రాజీనామా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వివరించి, తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు అవసరమైనంత ఎమ్యెల్యేల సంఖ్యా బలం తనకు ఉన్నదని పన్నీర్ చూపించుకోగలిగితే ఇది సాధ్యమేనని అంటున్నారు. అప్పుడు ఆయన రాజీనామాకు ఆమోదముద్ర వేసిన గవర్నర్ తిరిగి దాని ఉపసంహరణకు కూడా ఆమోదముద్ర వేయొచ్చని చెబుతున్నారు.
ఎంత మంది మద్దతు అవసరం?
పన్నీర్ సెల్వం తిరిగి తమిళనాడు సీఎం పీఠం అధిష్ఠించాలంటే.. 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. వారందరూ గవర్నర్ ఎదుట తాము పన్నీర్ సెల్వానికే మద్దతు తెలుపుతున్నామని ప్రకటించాల్సి ఉంటుంది.
అధ్యక్ష పాలన విధించే అవకాశం ఉందా?
గవర్నర్ విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు ప్రస్తుతానికి తమిళనాడు సీఎంగా ఓ పన్నీర్ సెల్వం కొనసాగుతున్నారు. అయితే ఈ రాజ్యాంగ సంక్షోభం ఎక్కువ రోజులపాటు కొనసాగడానికి వీలు లేదు. గడవులోగా ఇటు పన్నీర్ సెల్వంగాని లేదంటే అటు శశికళగాని సీఎం అయ్యేందుకు తమకు అవసరమైనంత సంఖ్యా బలాన్ని గనుక గవర్నర్ ఎదుట చూపించుకోలేని పక్షంలో.. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించమంటూ గవర్నర్ సిఫార్సు చేయడానికి అవకాశం ఉంటుంది.
గవర్నర్ విచక్షణాధికారం ఉపయోగిస్తే...
పన్నీర్ సెల్వం, శశికళ.. ఇద్దరిలో ఎవరూ కూడా తమకున్న సంఖ్యాబలాన్ని రుజువు చేసుకోలేని పరిస్థితే గనుక ఏర్పడితే.. గవర్నర్ విద్యాసాగర్ రావు తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి.. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని తమిళనాడు ముఖ్యమంత్రిగా నియమించ వచ్చు. అలా చూసుకున్నా తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అధిక అవకాశాలు పన్నీర్ సెల్వంకే ఉన్నాయి. ఇప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం కొనసాగుతున్నారు కాబట్టి గవర్నర్ కూడా ఆయన వైపే మొగ్గుచూపే అవకాశం లేకపోలేదు.
పన్నీర్ కు డీఎంకే మద్దతు లభిస్తుందా?
ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తోంది. తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే సంఖ్యాబలం తక్కువే. అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇప్పట్లో రావు. ఇంకా నాలుగు సంవత్సరాల వ్యవధి ఉంది. మరోవైపు డీఎంకే శశికళను ఆదినుంచీ వ్యతిరేకిస్తున్నది. దీంతో ఈ సంక్షోభ సమయంలో ఆ పార్టీ పన్నీర్ కే మద్దతు ఇస్తుంది. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తన విషయంలో సానుకూలంగా ఉండడం కూడా పన్నీర్ కు కలిసి వస్తుంది.
సీఎం అయ్యే అవకాశం శశికళకు ఉందా?
ఇటీవలనే అన్నాడీఎంకే మెజారిటీ ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నాయకురాలిగా శశికళను ఎన్నుకోవడంతో.. సీఎం అయ్యే అర్హత ఆమెకు రాజ్యాంగ బద్ధంగా, చట్టబద్ధంగానే వచ్చింది. అయినప్పటికీ ఎవరి సంఖ్యా బలం ఎంతో క్లియర్ గా తెలిసేంత వరకు సీఎం పీఠాన్ని అధిష్ఠించమంటూ శశికళను గవర్నర్ విద్యాసాగర్ రావు పిలవక పోవచ్చు. రాజ్యాంగ సంక్షోభ సమయంలో గవర్నర్ కు ఈ వెసులుబాటు ఉంటుంది.
పన్నీర్ పార్టీ నుంచి ఉద్వాసనకు గురైతే, అప్పుడు?
పన్నీర్ సెల్వంకు పార్టీ నుంచి ఉద్వాసన పలికే అధికారం పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన శశికళకు ఉంటుంది. ఇప్పటికే ఈ దిశగా ఆమె చర్యలు కూడా తీసుకుంది. అయినప్పటికీ పన్నీర్ సెల్వం సీఎం పదవికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఎందుకంటే.. ఇప్పటికే గవర్నర్ విద్యాసాగర్ రావు కోరికపై తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగుతున్నారు కాబట్టి.
అన్నాడీఎంకే ఎవరిచేతికొస్తుంది? శశికళదా? పన్నీర్ సెల్వందా?
ఇప్పుడు ఇటు శశికళగాని, అటు పన్నీర్ సెల్వంగాని అధికశాతం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తనవైపే ఉన్నారంటూ పరస్పరం ప్రకటించుకుంటున్నారు. అయితే ఈ సంఖ్యా బలానికి సంబంధించి గవర్నర్ ఎదుట నిరూపణ జరిగే వరకు ఈ విషయంలో క్లారిటీ అనేది రాదు. ప్రస్తుతం అన్నాడీఎంకే మొత్తం ఎమ్మెల్యేలు 135 మంది. వీరిలో ఎంత మంది శశకళకు, ఎంత మంది పన్నీర్ సెల్వానికి మద్దతు పలుకుతారో వేచిచూడాల్సి ఉంది. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అమలులో ఉన్నప్పటికీ మూడో వంతు మెజారిటీ ఎమ్మెల్యేలు అంటే 90 మంది ఎమ్మెల్యేలు ఎవరి పక్షాన ఉంటే పార్టీ వారిదిగా గవర్నర్ గుర్తిస్తారు.