ఎందుకు చేశావ్: నిందితుడితో ఇన్ఫోసిస్ టెక్కీ తండ్రి, కోర్టుకు రామ్
చెన్నై: నుంగంబక్కం రైల్వే స్టేషన్లో జరిగిన ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్ కుమార్కు మంగళవారం నాడు పుజల్ జైలులో దోష నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మూడు రౌండ్ల పాటు ఈ పరీక్షలు నిర్వహించారు. ఇక్కడకు స్వాతి తండ్రి శంతన గోపాలకృష్ణ కూడా వచ్చారు.
మూడో రౌండులో నిందితుడిని చూసిన స్వాతి తండ్రి తన ఆవేదనను, ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయారు. స్వాతి తండ్రి.. నిందితుడి చేయి పట్టుకొని ' నా కూతురును ఇలా ఎందుకు చేశావ్? (ఎందుకు చంపావ్). నువ్వు నా కూతురిని చంపావ్' అని ఆవేదన వెళ్లగక్కారు. ఆ సమయంలో నిందితుడి కళ్లలో కూడా నీళ్లు వచ్చాయని తెలుస్తోంది.
పరేడ్ ఇలా..
రామ్ కుమార్ పాటు మరి కొంతమందితో పోలీసులు జైలులో పరేడ్ నిర్వహించారు. పరేడ్ మంగళవారం మధ్యాహ్నం జరిగింది. సాక్షులు చెబుతున్న ప్రకారం.. నిందితుడి మెడ వద్ద గాయాలు ఉన్నాయి.
అధికారులు 35 మందిని సెలక్ట్ చేశారు. అందులో నుంచి కోర్టు పది మందిని ఎంపిక చేసింది. రామ్ కుమార్, మరో పదిమందితో పరేడ్ నిర్వహించారు.
తొలుత పరేడ్ నిర్వహిస్తున్న వారి మెడ గాయాల వద్ద టవల్స్ లేదా బ్యాండ్ ఎయిడ్ వేయాలని పోలీసు అధికారులు భావించారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరి మెడ గాయం వద్ద పత్తి పెట్టారు. వాటి పైన బ్యాండ్ ఎయిడ్ వేశారు.
మూడు రౌండ్ల పరేడ్ నిర్వహించారు. తొలి రౌండులో స్వాతి తండ్రి రామ్ కుమారే నిందితుడని చెప్పారు. నుంగంబక్కం రైల్వే స్టేషన్లోని దుకాణ యజమాని శివకుమార్ మూడు రౌండ్లలోను రామ్ కుమార్నే గుర్తించారు.
రెండో రౌండులో రామ్ కుమార్ సహా పరేడ్లో ఉంచిన వారందరికీ ఎర్ర రంగు చొక్కాను వేశారు. ఇద్దరు సాక్షులు నిందితుడిని సులభంగా గుర్తించారు. మూడో రౌండులో స్వాతి తండ్రి శంతన గోపాలన్ ఎమోషన్ అయ్యారు. కంటతడి పెడుతూ రామ్ కుమార్ చేయి పట్టుకొని నిలదీశారు.
కోర్టుకు రామ్ కుమార్
స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్ కుమార్ను పోలీసులు ఎగ్మూర్ కోర్టులో హాజరుపరిచారు. అతనిని పోలీసులు కస్టడీకి కోరారు. మంగళవారం నాడు మూడు రౌండ్ల పాటు పోలీసులు దోష నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా, బుధవారం అతనిని కస్టడీకి అప్పగించాలని పిటిషన్ వేశారు.