స్థోమత లేదు, పిల్లలకు మంచి చావు ప్రసాదించండటూ రాష్ట్రపతికి లేఖ..!
న్యూఢిల్లీ: తన 8 మంది పిల్లల్లో ఆరుగురికి ఎతినేషియా(అనాయాస మరణం)కు అనుమతి తెలపాల్సిందిగా కోరుతూ ఆగ్రాకు చెందిన 42 ఏళ్ల ఓ వ్యక్తి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశాడు. బాధితుడు నజిర్ రాసిన లేఖలోని వివరాలిలా ఉన్నాయి.
నేను మామూలు ఓ స్వీట్ దుకాణ నిర్వహకుడిని. నాకు ఎనిమిది మంది సంతానం. వీరిలో ఆరుగురు పిల్లలు కెనవాన్ అనే నరాల బలహీనత కలిగిన ఓ అరుదైన వ్యాధితో తీవ్ర వేదనను అనుభవిస్తున్నారు.
నా పెద్ద కుమారుడు, చిన్న కూతురు మాత్రమే సహజ ఎదుగుదలను కలిగి ఉన్నారు. వీరి పోషణ, చికిత్సకయ్యే ఖర్చును భరించలేకపోతున్నా. అంతే కాదు నా పిల్లల భవిష్యత్త పట్ల జాగ్రత వహించడంలో అలిసిపోయాను. అందుకే వారికి మంచి చావుని ప్రసాదించమని కోరుతున్నాను.
ఒకవేళ ఎతినేషియాకు అనుమతి నిరాకరిస్తే, పిల్లల వైద్యఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించాల్సిందిగా కోరాడు. ఆగ్రా జిల్లా అదనపు మేజిస్ట్రేట్ ఆదేశాలతో కుటుంబ పరిస్ధితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు నజీర్ కుటుంబాన్ని సందర్శించారు.
కుటుంబ సభ్యుల నుంచి ఆధార్, బీపీఎల్ కార్డులను తీసుకున్నారు. త్వరలోనే ప్రభుత్వం తరపు నుంచి తగిన సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు.