దేశంలో కరోనా డాక్టర్లకు ఊరట- విశ్రాంతి ఇస్తామని సుప్రీంకు తెలిపిన కేంద్రం
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం మొదలైన నాటి నుంచి లక్షలాది మంది వైద్యులు, వైద్య సిబ్బంది, సహాయకులు, పారా మెడికల్ సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా లక్షల మందిని కరోనా వైరస్ బారి నుంచి గట్టెక్కించారు. కరోనా వారియర్లుగా ముందు నిలిచి మునుపెన్నడూ లేని విధంగా దేశ ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కాస్త అదుపులోకి రావడంతో వీరికి విశ్రాంతి కల్పించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.
దేశంలో కరోనా అదుపులోకి వచ్చిన నేపథ్యంలో కోవిడ్ విధుల నుంచి డాక్టర్లకు విశ్రాంతి ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. దేశంలో కోవిడ్ రోగులకు అందుతున్న సేవలపై నమోదైన సుమోటో పిటిషన్పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుదీర్ఘకాలం కోవిడ్ రోగులకు సేవలందించిన డాక్టర్లకు విశ్రాంతి ఇవ్వకపోతే వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని హెచ్చరించింది.
కోవిడ్ రోగులకు అందుతున్న చికిత్స, మృతులకు మర్యాదపూర్వక అంతిమ సంస్కారాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సుప్రీం ధర్మాసనం సూచించింది. అలాగే కోవిడ్ సేవల్లో ఉన్న డాక్టర్లకు కొంత విశ్రాంతి ఇవ్వాలని కూడా సూచించింది. దీంతో ఈ విషయం తమ పరిశీనలో ఉందని కేంద్రం తరఫున తుషార్ మెహతా సమాధానమిచ్చారు. మరోవైపు కోవిడ్ సమయంలో మాస్కులు ధరించని వారి నుంచి ఇప్పటివరకూ రూ.90 కోట్ల రూపాయల ఫైన్ వసూలు చేయడంపై సుప్రీంకోర్టు విస్మయం, అభ్యంతరం వ్యక్తం చేసింది.