రాజకీయాలపై కిరణ్ బేడీకి వైరాగ్యం: ప్రజాసేవపై అనురక్తే
పానాజీ: మాజీ ఐపీఎస్ అధికారి, బిజెపి నాయకులు కిరణ్ బేడీకి రాజకీయ వైరాగ్యం వచ్చినట్లుంది.ఇకపై తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ఆమె స్పష్టం చేశారు. ఇటీవలి ఢిల్లీ ఎన్నికల్లో, బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన కిరణ్బేడీ ఘోరమైన ఓటమిని చవి చూశారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల తర్వాత జీవితం ఎలా ఉందని మీడియా వేసిన ప్రశ్నకు ఆమె రాజకీయ వైరాగ్యాన్ని కనబరిచారు. తాను చురుకైన రాజకీయవేత్తను కానని చెప్పారు. అయితే, ప్రజాసేవపట్ల అనురక్తి మాత్రం తగ్గలేదని అన్నారు.
ఢిల్లీ ఎన్నికలు తనకు ముందెన్నడూ లేనంతటి అద్భుత అనుభవాన్నిచ్చాయని, తాను చేయాల్సిందేదో చేయకూడనిదేదో నేర్పాయని అన్నారు. ప్రజా సేవకు క్రియాశీలక రాజకీయాలను మాత్రం ఎంచుకోనని కిరణ్ బేడీ స్పష్టం చేశారు. బిజెపి ఇచ్చిన అవకాశం తన జీవితానికి ఎంతగానో ఉపయోగపడిందని, అందుకే తాను బిజెపి కృతజ్ఝతలు తెలుపుతున్నానని ఆమె చెప్పారు.
తాను ప్రజా సేవ చేయడానికి మళ్లీ వస్తున్నానని, అయితే రాజకీయాల్లోకి మాత్రం రాబోనని, రాజకీయమనేది తన భాష కాదని ఆమె అన్నారు. పుమెన్ ఎకనమిక్ ఫోరం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆమె పానాజీకి వచ్చారు. ఆ సమయంలో రాజకీయాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు.