భార్యపై బలవంతపు శృంగారం నేరం కాదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భార్యతో బలవంతంగా శృంగారంలో పాల్గొనడాన్ని(మారిటల్ రేప్) నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై పార్లమెంటులో ఇప్పటికే చర్చ జరిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 375లో రెండో క్లాజు ప్రకారం 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న భార్యతో భర్త జరిపే శృంగారం అత్యాచారం కిందికి రాదు. ఈ క్లాజును సవాల్ చేస్తూ 'ఇండిపెండెంట్ థాట్' అనే స్వచ్ఛంద సంస్థ 2013లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఆ క్లాజు రాజ్యాంగ విరుద్ధమని.. అది రాజ్యాంగం దేశ పౌరులందరికీ ప్రసాదించిన సమానత్వ, గౌరవంగా జీవించే హక్కులకు విఘాతం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. 18ఏళ్లలోపు మహిళలతో వారి అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నా అది రేప్ కిందకే వస్తుందని.. అలాంటిది 'వివాహం' అనే ఒక్క కారణంతో అది రేప్ కాకుండా పోదని ఆ సంస్థ పేర్కొంది.
వివాహం అయిందా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా.. శృంగారానికి సమ్మతి ఇవ్వదగ్గ వయసును 18 ఏళ్లు గా నిర్ధారించాలని, ఆలోపు వయసున్న అమ్మాయిలతో భర్తే శృంగారంలో పాల్గొన్నా.. రేప్గానే పరిగణించాలని ఆ సంస్థ కోరింది. జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ముందుకు బుధవారం ఈ కేసు విచారణకు రాగా.. కేంద్రం తరఫున న్యాయవాది బిను టమ్టా వాదనలు వినిపించారు.
సామాజిక, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పార్లమెంటు.. భార్య వయస్సు 15ఏళ్ల పరిధిని పెట్టిందన్నారు. అయితే, 15-18 ఏళ్లలోపు అమ్మాయిలు శారీరకంగా పూర్తిగా ఎదగరని, పూర్తిస్థాయి విచక్షణతో వారు నిర్ణయం తీసుకోలేరని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. దీనికి ధర్మాసనం.. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం 15ఏళ్లలోపు అమ్మాయిలతో సమ్మతితో శృంగారంలో పాల్గొన్నా.. అది రేప్ కిందకే వస్తుందని, 15-18 ఏళ్లలోపు వివాహితల సమ్మతితో వారి వారి భర్తలు శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కిందికి రాదని స్పష్టం చేసింది.
'ఈ అంశంపై పార్లమెంటు విస్తృతంగా చర్చించి, అది అత్యాచారం కిందికి రాదని అభిప్రాయపడింది. కాబట్టి, అది క్రిమినల్ అఫెన్స్ కిందికి రాదు' అని తేల్చిచెప్పింది. అంతేగాక, '18ఏళ్ల లోపుండి కాలేజీకెళ్లే యువతలో చాలా మంది పరస్పర సమ్మతితో శృంగారంలో పా ల్గొంటున్నారు. వారిలో కొందరిపై కేసులు నమోదవుతున్నాయి. ఇందులో అబ్బాయిల తప్పు లేదు. వారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించ డం క్రూరం' అని వ్యాఖ్యానించింది.
బాల్యవివాహాల చట్టం కింద గత మూడేళ్లలో ఎంతమంది తల్లిదండ్రులపై లేదా సంరక్షకులపై కేసులు నమోదు చేశారు?, ఆ చట్టం కింద ఎంతమంది 'చైల్డ్ మారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్(సీఎంపీవో)'ను నియమించిందీ 3 వారాల్లోగా తెలపాలని కేంద్రాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.