దేవయాని ఇష్యూ: జీతంపై తప్పులో కాలేసిన అమెరికా!
న్యూఢిల్లీ/వాషింగ్టన్: దౌత్యకారిణి దేవయాని అంశంలో అమెరికా తప్పులో కాలేసిందా? అంటే అవుననే అంటున్నారు ఆమె లాయరు. సమాచారాన్ని సరిగా పరిశీలించకుండా భారత దౌత్యవేత్త దేవయానిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసి పరాభవించింది. దేవయాని జీతాన్నేపని మనిషి ఆశిస్తున్న వేతనంగా పరిగణించి వీసా నేరానికి పాల్పడిందంటూ రాద్దాంతం చేసిన అమెరికా అధికారుల అసలు తప్పు వెలుగు చూసింది.
దేవయానిపై దాఖలైన కేసు దర్యాప్తులో చోటుచేసుకున్న తప్పిదాన్ని ఆమె లాయర్ బుధవారం బయట పెట్టారు. ఆమె ఇంటి పని మనిషి విషయంలో అందజేసిన వివరాలను తప్పుగా అర్థం చేసుకున్నారని డేనియల్ అర్షాక్ వెల్లడించారు. దేవయాని ఇంట్లో పని చేసిన సంగీతా రిచర్డ్ వీసా దరఖాస్తులో భాగంగా చేర్చిన డిఎస్-160 పత్రంలో పేర్కొన్న వివరాలను దౌత్య భద్రతా సర్వీసుల ఏజెంట్ తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు.
సంగీతా రిచర్డ్ తాను ఆశిస్తున్న జీతాన్ని 4500 డాలర్లుగా ఈ పత్రంలో పేర్కొన్నారు. నిజానికి అక్కడ ఆమె రాసింది తనకు పని కల్పిస్తున్న దేవయాని జీతాన్ని. పని మనిషికి అంత మొత్తం జీతం ఎలా ఇస్తారన్న విషయాన్ని పరిశీలించకుండా వీసా నేరానికి పాల్పడిందంటూ దేవయానిపై కేసు నమోదు చేశారని ఆమె లాయర్ పేర్కొన్నారు. నిజానికి దేవయాని మూల వేతనమైన 4500 డాలర్ల మొత్తాన్ని డిఎస్-160 పత్రంలో నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
నాన్ ఇమిగ్రాంట్ వీసాలు కోరుకునే వారందరూ ఆన్లైన్ ద్వారా డిఎస్-160 ఫారాన్ని అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. దేవయాని అందించిన వివరాలను పరిశీలించిన ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు పని మనిషికి గంటకు 9.75డాలర్ల చొప్పున వారానికి 40 గంటలకు గాను చెల్లించే ఆర్థిక స్థోమత దేవయానికి ఉందని నిర్ధారించారు. ఈ మొత్తం వేతనం చెల్లించడానికే దేవయాని - సంగీతా రిచర్డ్ మధ్య ఒప్పందం కూడా కుదిరింది. సరిగా వివరాలు పరిశీలించకుండా ఇంత తీవ్ర తప్పిదానికి పాల్పడటం చాలా తీవ్రమని దౌత్యవేత్త న్యాయవాది వ్యాఖ్యానించారు.