ఎంహెచ్17: ఏ దేశంవారు ఎంతమంది? బ్లాక్బాక్స్ లభ్యం
కౌలాలంపూర్: మలేషియా విమానం ఎంహెచ్ 17 ప్రమాదంలో 298 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో మరో 21 మందిని గుర్తించాలని మలేషియా ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనలో అమెరికాకు చెందిన వారు 23, నెదర్లాండ్స్కు చెందిన వారు 153, మలేషియా వాసులు 44, ఆస్ట్రేలియా దేశస్తులు 27, ఇండోనేషియా వారు 12 మంది, బ్రిటన్ వాసులు 9, 4గురు చొప్పున జర్మన్, పిలిప్సీన్, బెల్జియం వాసులు ఉండగా, కెనడాకు చెందిన వారు ఒకరు మృతి చెందినట్లు తెలిపింది. ఇద్దరు ఎన్నారైలు కూడా ఉన్నారని వార్తలు వస్తున్న విషయంతెలిసిందే. ఈ విమానం ప్రమాదం పైన స్వతంత్ర దర్యాఫ్తు చేయించాలని మలేషియా రవాణా మంత్రి డిమాండ్ చేశారు. ఈ ఘటన కారకులను బోనెక్కిస్తామన్నారు.
కూలిపోయిన మలేషియా విమానం రెండు బ్లాక్ బాక్స్ శుక్రవారం లభ్యమైంది. నారింజ రంగులో ఉండే బ్లాక్ బక్స్ విమానానికి ఎంత పెద్ద ఉపద్రవం సంభవించినా చెక్కుచెదరదు. దీనిలో అన్ని వివరాలు రికార్డవుతాయి. మలేసియాకు చెందిన ఎంహెచ్ 17 విమానం ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లో కూలింది. బ్లాక్ బాక్స్ కూడా తమ ఆధీనంలోనే ఉందని డోనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ ప్రకటించింది. బ్లాక్ బాక్స్ను మాస్కో పంపాలని భావిస్తోంది. కాగా, అంతర్జాతీయ సమాజం బ్లాక్ బాక్స్ను అంతర్జాతీయ దర్యాప్తు బృందానికి అందజేయాలని సూచిస్తోంది. ఇకపై ఉక్రెయిన్ మీదుగా వెళ్లరాదని ఎయిరిండియా సహా 15 సంస్థలు నిర్ణయించాయి.
కాగా, మలేషియా విమానాన్ని ఉగ్రవాదులు కూల్చివేసిన నేపథ్యంలో పలు విమానాలను దారి మళ్లించి ఇతర మార్గాల ద్వారా నడిపిస్తున్నారు. అలా దారి మళ్లించి నడిపిన విమానాలలో ప్రధాని మోడీ ప్రయాణించిన ఎయిర్ ఇండియా వన్ విమానం కూడా ఉంది. బ్రెజిల్లో బ్రిక్స్ సదస్సుకు హాజరై ఆయన గురువారం రాత్రి భారత్ తిరిగి వచ్చారు. సాధారణంగా భారత విమానాలు ఉక్రెయిన్ కారిడార్ మీదుగా ప్రయాణిస్తాయి. ఇతర మార్గాలు ఉన్నా వాతావరణం సానుకూలతను బట్టి ఆ మార్గాన్ని వినియోగిస్తారు.
మలేషియా విమాన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. బ్రెజిల్ పర్యటన ముగించిన భారత్ చేరుకున్న ఆయన ట్విట్టర్ లో ఈ మేరకు స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది సహా 298 మంది మరణించారు.
మరోవైపు, ఓ మలేషియన్ న్యూస్ పేపర్ క్రూ మెంబర్స్ పేర్లను విడుదల చేసింది. విమానంలో ప్రయాణీకులతో పాటు 15 మంది క్రూ మెంబర్స్ మృతి చెందారు. వారి పేర్లను విడుదల చేశారు. ఈ ప్రమాదంలో భారత సంతతికి చెందిన ఎనిమిది మంది మృతి చెందారు. కెప్టెన్ వాన్ అమ్రాన్ బిన్ వాన్ హుస్సేన్, చూ జిన్ లియోంగ్, అహ్మద్ హకీమ్ బిన్ హనాపీ, మహమ్మద్ ఫిర్దౌస్ బిన్ అబ్దుల్ రహీమ్, మహమ్మద్ గఫర్ బిన్ అబూ బకర్, డోరా షమీలా బింటీ ఖాసీం, అజ్రినా బింటీ యాకోబ్, లీ హూ పిన్, మస్తురా బింటీ ముస్తఫా, చోంగ్ యీ పెంగ్, షేక్ మహమ్మద్ నూర్ బిన్ మహమూద్, సాజిద్ సింగ్ సందూ, హంఫాజ్లిన్ షామ్ బింతీ మహమ్మద్ అరీఫిన్, నూర్ షనజానా బింతీ మొహమ్మద్ షాలే, ఏంజెలిన్ ప్రేమిలా రాజంద్రన్
ఎంహెచ్ 17
ఉక్రెయిన్-రష్యా సరిహద్దులో గురువారం ఉద్రవాదులు క్షిపణి దాడి చేసి మలేషియా విమానా(ఎంహెచ్17)న్ని పేల్చివేయడంతో.. విమానంలో ఉన్న మొత్తం 295 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 15 మంది విమాన సిబ్బంది కూడా ఉన్నారు.
ఎంహెచ్ 17
భారత కాలమానం ప్రకారం ఈ దుర్ఘటన గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలిసింది. గల్లంతైన మలేషియా విమానం ఎంహెచ్ 370 ఘటన మరువకముందే ఇలాంటి ఘటన జరగడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది.
ఎంహెచ్ 17
తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో ఎంహెచ్ 17 మలేషియా విమానం కూలిపోయింది. గ్రాబోవో గ్రామం వద్ద ఈ దారుణ సంఘటన జరిగింది.
ఎంహెచ్ 17
విమానం శకలాలు దాదాపు 15 కిలోమీటర్ల చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. విమానంలో ఉన్నవారిలో 280 మంది ప్రయాణికులతో పాటు 15 మంది విమాన సిబ్బంది కూడా మృత్యువాత పడ్డారు.
ఎంహెచ్ 17
రష్యా అనుకూల తిరుగుబాటుదారులకు నిలయమైన దోన్త్క్స్ అనే ప్రాంతంలో షాక్తార్స్క్ పట్టణ సమీపానికి చేరుకున్న తర్వాత విమానాన్ని క్షిపణితో దాడి చేసి కూల్చివేసినట్లు సమాచారం.
ఎంహెచ్ 17
ఈ దాడి ఉక్రెయిన్లోని రష్యన్ మద్దతుదారుల పనేనని ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ను లక్ష్యంగా చేసుకుని అసత్య ఆరోపణలు చేయడం సరికాదని రష్యన్ అనుకూల వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎంహెచ్ 17
కానీ ఉక్రెయిన్ దళాలే పేల్చేశాయని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు పేర్కొంటుండగా.. అది తిరుగుబాటుదారుల పనేనంటూ ఉక్రెయిన్ ఆరోపిస్తుంది.
ఎంహెచ్ 17
ఘటన పట్ల ఉక్రెయిన్ ప్రభుత్వంపై పుతిన్ విమర్శలు గుప్పించారు. తూర్పు ఉక్రెయిన్ ఆ దేశ ప్రభుత్వం అశాంతిని నెలకొల్పుతోందని ఆరోపించారు. రష్యాలో తయారైన క్షిపణితోనే దాడి జరిగిందని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.