స్పెయిన్లో యాప్ తాత్కాలికంగా రద్దు, ఒత్తిడిలో 'ఉబేర్'
న్యూఢిల్లీ/మాడ్రిడ్: ఉబేర్ ట్యాక్సీని ఆన్ లైన్లో బుక్ చేసుకోవడాన్ని ఆపాలని స్పెయిన్కు చెందిన ఓ న్యాయమూర్తి ఆదేశించారు. స్పెయిన్లో ఉబేర్ ట్యాక్సీ యాప్ను ఆపేయాలన్నారు. చాలారోజులుగా ట్యాక్సీ అసోసియేషన్లు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆదేశాలు జారీ చేశారు.
తాత్కాలికంగా పేర్కొన్న న్యాయమర్తి.. ఉబేర్ డ్రైవర్లకు అధికారిక ఆథరైజేషన్ లేదని, అలాగే అన్ ఫెయిర్ కాంపిటీషన్కు దిగుతోందని ఆరోపించారు. కాగా, మాడ్రిడ్ ట్యాక్సీ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు న్యాయమూర్తి విచారణ జరిపారు. మరోవైపు, ఉబేర్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. స్పెయిన్లో తమ కంపెనీ వ్యవస్థ ఆగలేదని చెప్పారు.
కాగా, ఢిల్లీలో ఉబేర్ క్యాబ్ డ్రైవర్ యువతి పైన అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు శివకుమార్ యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం నాడు ముంబైలోని ఉబేర్ క్యాబ్ సర్వీసు మేనేజర్ పైన పలువురు చేయి చేసుకున్నారు.
కేంద్రమంత్రిని కలిసిన ఆమ్ ఆద్మీ పార్టీ
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు బుధవారం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ను కలిశారు. దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రత అంశాన్ని వారు ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. ఢిల్లీలో భద్రత అంశంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని వారు కోరారు.
ఒత్తిడిలో ఉబేర్
దేశంలో వరుసగా తమ సంస్థ పైన నిషేధాలు, ఫిర్యాదులు నమోదవుతుండటంతో ఉబేర్ ట్యాక్సీ సంస్థ ఒత్తిడిలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఉబేర్ సంస్థ పైన లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కోలో కేసులు, స్పెయిన్, భారత దేశాలలో వరుస నిషేధాల నేపథ్యంలో ఒత్తిడిలో ఉందని చెబుతున్నారు.