శరణార్థులపై మహిళా జర్నలిస్టు పైశాచికం(వీడియో)
హంగేరీ: ఓ మహిళా జర్నలిస్టు తన (మృత సిరియా బాలుడి)ఫొటోతో శరణార్థుల పట్ల ప్రపంచాన్ని కదిలించేలా చేస్తే.. మరో మహిళా జర్నలిస్టు తన పైశాచికంతో ప్రపంచ ఆగ్రహానికి గురైంది. అంతేగాక, తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయింది.
సముద్ర తీరంలో నిద్రిస్తున్నట్లుగా చనిపోయిన అయలన్ కుర్దీ పొటోను తీసి, శరణార్థుల సంక్షోభాన్ని తాత్కాలికంగానైనా నిరోధించిన ధీరోదాత్త మహిళా జర్నలిస్ట్ కమ్ ఫొటోగ్రాఫర్ నిలుఫర్ డెమిర్.
కాగా, ఇప్పుడు మరో మహిళా జర్నలిస్టు పెట్రా లాజ్లో తన పైశాచికంతో ప్రపంచ ప్రజల ఆగ్రహానికి గురైంది. ఎన్1 టీవీ అనే ఛానెల్లో వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్న ఈమె.. కుర్దీ చావుతో తెరుచుకున్న యూరప్ మార్గాల గుండా కొత్త లోకంలోకి ప్రవేశిస్తున్న.. దాదాపు కుర్దీ వయసే ఉన్న చిన్నారులపై తన పైశాచికాన్ని ప్రదర్శించింది.
వివరాల్లోకి వెళితే.. సెర్బియా- హంగరీ సరిహద్దులోని రోజ్కే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యదరా సముద్రాన్ని దాటి సెర్బియా గుండా హంగేరీలోకి ప్రవేశించే సిరియా శరణార్థులను తనిఖీ చేసే ప్రదేశం రోజ్కే.
ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తనిఖీల కోసం శరణార్థులు పరుగుపెట్టారు. వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అలా పరుగెడుతూ తన దగ్గర్నుంచి వెళుతున్న వారికి కాళ్లు అడ్డంపెట్టి పడేసింది మహిళా జర్నలిస్టు పెట్రా లాజ్లో.
చిన్నారులని కూడా చూడకుండా వారిని కాళ్లతో తన్నింది. చిన్నారిని ఎత్తుకొని వస్తున్న మరో వ్యక్తికి కాలు అడ్డంపెట్టి పడేసింది. కాగా, నిజానికి ఆమె అక్కడికొచ్చింది శరణార్థుల బాధలు షూట్ చేయడానికి కావడం గమనార్హం. బాధ్యతను మరిచిన ఆ మహిళా జర్నలిస్టు.. తనలోని పైశాచికత్వాన్ని ఇలా ఫ్రదర్శించింది.
అలా పెట్రా శరణార్థులను హింసించిన దృశ్యాలు వేరొక ఛానెల్కు చెందిన కెమెరాకు చిక్కాయి. గత మంగళవారం ప్రసారమైన కార్యక్రమంలో పెట్రా పైశాచికాన్ని ప్రపంచమంతా వీక్షించింది. దీంతో నలువైపుల నుంచి ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆమెను ఎన్1 టీవీ యాజమాన్యం డిస్మిస్ చేసింది.