బోటు ప్రమాదంపై సమీక్షతో సరిపోతుందా ? ఆ ఫోటోలు ఎందుకు బయటపెట్టలేదని హర్షకుమార్ సంచలనం
తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరులో బోటు ప్రమాద సంఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హర్ష కుమార్ బోటు బయటికి తీయడం అధికారులకు మంత్రులకు ఇష్టంలేదని ఆరోపించారు. బోటులో 93 మంది ఉన్నట్టు పేర్కొన్న ఆయన మరోమారు వైసిపి సర్కార్ పై విమర్శల వర్షం కురిపించారు . బోటు ప్రమాద ఘటనపై మరోమారు ఆరోపణలు చేసిన హర్ష కుమార్ గోదావరి నదిలో మునిగిపోయిన బోటును బయటకు తీయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్టు కనిపిస్తోందని విమర్శించారు.
బోటు ప్రమాద ఘటన పై సమీక్ష నిర్వహించి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అంటూ ప్రశ్నించారు. ఇక మృతుల కోసం గాలింపు నిలిపివేసిన ప్రభుత్వాన్ని తాను నిలదీయడం వల్లే మళ్లీ కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రజలు, బాధితుల తరఫున తాను మాట్లాడిన తర్వాతే ప్రభుత్వం ఓ కమిటీని నియమించిందని పేర్కొన్నారు హర్షకుమార్.
గతంలో దేవీపట్నం బోటు ప్రమాద ఘటనపై, పుష్కరాల సమయంలో ప్రమాద ఘటనపై వైసిపి తీవ్ర విమర్శలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు మాజీ మంత్రి హర్షకుమార్. ఇక ఆ ఘటనలకు సంబంధించి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని , ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని విమర్శలు గుప్పించిన వైసిపి నేడు అదే దారిలో పయనిస్తున్నారు అంటూ మండిపడ్డారు.

ఇక తాజాగా జరిగిన బోటు ప్రమాద ఘటనపై ఎవరిపైన చర్యలు తీసుకున్నారని ప్రశ్నించిన ఆయన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినంత మాత్రాన సరిపోతుందా అని సీఎం జగన్ ని ప్రశ్నిస్తున్నారు. బోటులో 93 మంది ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన తాను చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నానని బోట్లో పెద్దసంఖ్యలో పర్యాటకులు ఉన్నారని పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో నదిలో పోలీసులు తీసిన ఫోటోలను ఎందుకు బయటకు పెట్టట్లేదని ఆయన నిలదీశారు. బోటును బయటకి తీయక పోవడానికి కారణం కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఉండడమేనని హర్షకుమార్ పేర్కొన్నారు. ఏది ఏమైనా హర్ష కుమార్ మరోమారు చేసిన వ్యాఖ్యలు కచ్చులూరు బోటు ప్రమాద ఘటనపై పలు అనుమానాలకు తావిస్తోంది.












Click it and Unblock the Notifications