హైద్రాబాద్ లో తగ్గిన క్రైమ్, సిసిటివి కెమెరాలు, పిడి యాక్టు, కార్డన్ సెర్చ్ లతో నేరాల తగ్గుదల
హైద్రాబాద్ లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ సుమారు 14 శాతం తగ్గిందని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి.అయితే సిసిటివి కెమెరాలు, కార్డన్ సెర్చ్ లు
హైదరాబాద్ :హైద్రాబాద్ నగరంలో గత ఏడాదితో పోలిస్తే సుమారు 14 శాతం క్రైమ్ రేటు తగ్గింది. సిసిటివిలు, పిడియాక్టులు, కార్డన్ సెర్చ్ ల నిర్వహణ ఇతరత్రా కారణాలతో క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిపోయిందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. హైద్రాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ది చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న తరుణంలో క్రైమ్ రేటు తగ్గడం కూడ కలిసివచ్చే పరిణామంగా అధికారపార్టీ నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
హైద్రాబాద్ కు భ్రాండ్ ఇమేజ్ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం హైద్రాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలను ప్రారంభించింది.
హైద్రాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం ద్వారా ప్రాజెక్టులు, పెట్టుబడులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు శాంతిభద్రతల పరిస్థితిని పరిశీలిస్తారు.
శాంతిభద్రతల సమస్య వాటిల్లకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంది. నేరాలకు అడ్డుకట్టవేసేందుకు అనేక చర్యలు తీసుకొంది. కార్డన్ సెర్చ్ లు, పిడి యాక్టులు పెట్టారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొంది.
14 శాతం తగ్గిన నేరాల సంఖ్య
విశ్వనగరంగా హైద్రాబాద్ ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.అయితే గత ఏడాదితో పోలిస్తే నేరాల సంఖ్య 14 శాతం తగ్గడం శుభపరిణామంగా పోలీసులు భావిస్తున్నారు.2015 సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 14 శాతం నేరాల సంఖ్య తగ్గిందని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. 2015 సంవత్సరంలో 21,285 నేరాలు నమోదు అయ్యాయి.అయితే ఈ ఏడాది కేవలం 18375 మాత్రమే నమోదైనట్టు రికార్డులు చెబుతున్నాయి.హత్యలు 25 శాతం, తీవ్రనేరాలు 31 శాతం, ఆస్థి సంబంధ నేరాలు 16 శాతం, చైన్ స్నాచింగ్ లు 66 శాతం, వేధింపుల కేసులు 18 శాతం, గృహహింస కేసులు 8 శాతం తగ్గాయి. అయితే మహిళలపై అత్యాచారాలు గత ఏడాదితో పోలిస్తే పెరిగాయని పోలీసులు రికార్డులు చెబుతున్నాయి.
కార్డన్ సెర్చ్ లు, పిడి యాక్టులతో ఫలితాలు
నగరంలో నేరాలను అదుపుచేసేందుకు నగర పోలీసులు కార్చన్ సెర్చ్ లు నిర్వహిస్తున్నారు. అర్థరాత్రి పూట తాము ఎంచుకొన్న ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తారు . అనుమానితులను, అనుమానిత వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొంటారు.ఈ సెర్చ్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి.నగరంలో సుమారు 90 చోట్ల కార్డెన్ సెర్చ్ లు నిర్వహించారు. అయితే 61 కార్డెన్ సెర్చ్ ల్లో సుమారు 116 మందిని పోలీసులు అరెస్టుచేశారు. ఈ ఏడాది 23 మందికి జీవిత ఖైదు పడింది.అయితే పిడి యాక్ట్ కింద 283 కేసులు నమోదయ్యాయి. గడిచిన రెండేళ్ళతో పోలిస్తే ఈ ఏడాది 36 శాతం శిక్షలు పెరిగాయని పోలీసులు చెబుతున్నారు.
తగ్గిన వరకట్నం కేసులు
వరకట్నం కోసం చనిపోయినట్టు ఈ ఏడాది ఒక్క కేసు కూడ నమోదు కాలేదు. అయితే వరకట్నం కోసం ఆత్మహత్యను ప్రేరేపించే కేసుల్లో కూడ తగ్గుదల కన్పించింది.గత ఏడాదితో పోలిస్తే వరకట్నం కోసం ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులు 26 నమోదైతే,ఈ ఏడాది కేవలం 17 మాత్రమే ఉన్నాయి. వేధింపుల కేసులు కూడ తగ్గాయి. 1175 నుండి 960 కు కేసులు నమోదు అయ్యాయి. మహిళల హత్యలు 15 నుండి 11కు, కిడ్నాప్ లు 74 నుండి 64కు తగ్గిపోయాయి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులు 329 నుండి 327 కు తగ్గాయి.
చిన్నారులకు విముక్తి
ఆపరేషన్ స్మెల్ లో భాగంగా వెట్టి చేస్తున్న బాలకార్మికులకు పోలీసుశాఖ విముక్తి కల్పించింది. ఈ పథకంలో భాగంగా సుమారు 897 మందికి విముక్తి కల్గించింది పోలీసుశాఖ. వీరిలో 872 మంది బాలురు కాగా, 25 మంది బాలికలున్నారు. సిపిఎస్, డిటెకట్టివ్ విభాగాల్లో ఈ ఏడాది నమోదైన 543 కేసుల్లో 205 మందిని అరెస్టుచేశారు పోలీసులు.109 మంది అంతరాస్ట్ర నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఆరుగురు నైజీరియన్లున్నారు. సిసిఎస్ లో నమోదైన 87 సైబర్ నేరాల్లో 75 మంది నిందితులను న్యూడిల్లీ, ముంబాయి, కోల్ కత్తాకు చెందినవారున్నారు
తాగి నడిపితే శిక్షే
మద్యంతాగి వావాహనాలు నడిపితే పోలీసులు కేసులు నమోదుచేస్తున్నారు. పట్టపగలే మద్యం తాగి విధ్యార్థులు కారు నడిపి ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటన జరిగిన తర్వాత కూడ మరో రెండు ఘటనలు ఇదే తరహలో చోటుచేసుకొన్నాయి.మద్యం తాగి వాహనాలు నడిపే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 30వ, తేదివరకు 16,602 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.అయితే ఇందులో 7,017 మందికి శిక్షలు పడ్డాయి.రాత్రిపూట బైక్ రేసింగ్ లు నిర్వహించే వారిని పోలీసులు అరెస్టుచేస్తున్నారు. వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.15,667 మంది మందుబాబులకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు.
కేసుల పరిష్కారానికి సిసి కెమెరాలు
నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సిసి కెమెరాల ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించారు పోలీసులు. నార్త్ జోన్ పరిధిలో 1219 సిసి కెమెరాలు ఏర్పాటుచేశారు. వీటి ద్వారా 2484 కేసులను పరిష్కరించారుఈస్ట్ జోన పరధిలో 987 సిసి కెమెరాల ద్వారా1152 కేసులను పరిష్కరించారు. వెస్ట్ జోన్ పరిధిలో 1315 సిసి కెమెరాలను ఏర్పాటుచేసి 6193 కేసులను పరిష్కరించారు.సౌత్ జోన్ లో 479 సిసి కెమెరాలకు తోడుగా 511 కమ్యూనిటీ కెమెరాలను ఏర్పాటు చేశారు.