ఆ ఉగ్రవాదులకు బాంబుల తయారీ తెలుసు: ‘టి’లో కలకలం
హైదరాబాద్: భోపాల్ జైలు నుంచి ఆదివారం అర్ధరాత్రి తర్వాత పరారై.. మధ్యప్రదేశ్ పోలీసుల చేతిలో ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటన తెలంగాణలో కలకలం సృష్టించింది . ఎందుకంటే.. ఈ ముఠా సభ్యులు తెలంగాణలో పలు నేరాలకు పాల్పడటం తోపాటు, తెలంగాణ పోలీసులపై ప్రతీకారం తీర్చుకుంటామని ఒడిశాలో పట్టుబడ్డ సిమి ఉగ్రవాదులు అప్పట్లోనే హెచ్చరికలు చేశారు.
కాగా, 2013 అక్టోబరు 1వ తేదీన మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జైలు నుంచి పరారైన సిమీ ఉగ్రవాదుల కథ సరిగ్గా మూడేళ్లకు (2016 అక్టోబరు 31) ముగిసింది. పోలీసు అధికారిని హత్య చేసిన నేరంలో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు సిమీ ఉగ్రవాదులు అబూ ఫైజల్, జకీర్ హుస్సేన్ అలియాస్ సాదిక్, మహ్మద్ అస్లాం అలియాస్ బిలాల్, షేక్ మహబూబ్ అలియాస్ గుడ్డూ, అమ్జాద్, మహ్మద్ ఎజాజుద్దీన్, అబిద్ మిర్జాలు 2013 అక్టోబరు 1వ తేదీన జైలు సిబ్బంది కళ్లుగప్పి పరారయ్యారు.
వీరిలో గత సంవత్సరం మే నెలలో నల్గొండ జిల్లా జానకీపురం వద్ద మహ్మద్ అస్లాం, ఎజాజుద్దీన్లు పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించారు. అబూఫైజల్, అబీద్ మిర్జాలు మధ్యప్రదేశ్ పోలీసులకు పట్టుబడ్డారు. మిగతా ముగ్గురు జాకీర్ హుస్సేన్ అలియాస్ సాదిక్, అమ్జాద్, మహబూబ్లకు సాలక్ అనే మరో యువకుడు తోడయ్యాడు. జైలు నుంచి పరారైనప్పటి నుంచే వీరి కోసం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ)తోపాటు వివిధ రాష్ట్రాల పోలీసులు దేశవ్యాప్తంగా తీవ్రంగా గాలిస్తున్నారు.
8 మంది సిమి ఉగ్రవాదుల హతం: ఇలా దొరికిపోయారు(పిక్చర్స్)
ఎట్టకేలకు వీరు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒడిశాలో తెలంగాణ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిలో మహబూబ్ తల్లి నజ్మాబీ కూడా ఉంది. పాత కేసుల విచారణ కోసం వీరిని మధ్యప్రదేశ్లోని భోపాల్ జైలుకు తరలించగా అక్కడ నుంచి పాత పద్ధతిలోనే పరారయ్యేందుకు ప్రయత్నించి సోమవారం ఉదయం ఎన్కౌంటర్లో మరణించారు.
దోపిడీలు, పేలుళ్ల కేసులు
దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు ఈ ముఠా బ్యాంకు దోపిడీలకు పాల్పడుతోంది. 2013లో జైలు నుంచి పరారైన తర్వాత 2014 ఫిబ్రవరి 1వ తేదీన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బ్యాంకు దోపిడీకి పాల్పడింది. దీంతోపాటు దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో ఈ ముఠా దోపిడీలకు పాల్పడినట్లు తేలింది.
2014 మే 1వ తేదీన బెంగళూరు-గౌహతి రైల్లో జరిగిన పేలుడు వెనుకా ఈ ముఠా ఉన్నట్లు తేలింది. అదే సంవత్సరం జులై 10వ తేదీన పుణెలోని ఒక పోలీస్స్టేషన్ ఎదుట నిలిపిఉంచిన ద్విచక్రవాహనంలో పేలుడు కూడా ఈ ముఠాపనేనని తేలింది. ఇవి కాకుండా సిమీ ముఠా దేశవ్యాప్తంగా ఇంకా అనేకచోట్ల విధ్వంసానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
ముఠాలోని ఇద్దరు సభ్యులు నల్గొండ జిల్లాలో పోలీసు కాల్పుల్లో మరణించారు. రూర్కీలో తలదాచుకుంటున్న మిగతా ముగ్గుర్నీ తెలంగాణ పోలీసులే అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులపై వీరు కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. రూర్కీలో పట్టుబడ్డ తర్వాత పోలీసు విచారణలో ఈ విషయాన్ని వెల్లడించారని.. అవకాశం దొరికితే తెలంగాణ పోలీసులపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
యూపీలు బాంబుల తయారీ
సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పుల్లో హతమైన 8మంది ఉగ్రవాదుల్లో నలుగురు ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో బాంబుల తయారీని నేర్చుకున్నారు. సెప్టెంబర్ 12, 2014లో జాతన్ కాలనీలోని ఓ ఇంట్లో ఉన్న ఈ ఉగ్రవాదులను పోలీసులు పట్టుకునేందుకు వెళ్లగా అక్కడ పేలుడుకు పాల్పడి తప్పించుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో ఆ ఇంట్లో అస్లాం, ఇజాజ్, జకీర్, అంజద్, సల్లు అలియాస్ సాలిక్, మెహబూబ్ ఉన్నట్లు తెలిసింది.
కాగా, ఏప్రిల్ 3, 2015లో అస్లాం, ఇజాజ్ తెలంగాణ పోలీసుల కాల్పుల్లో మరణించగా, సోమవారం ఉదయం మధ్యప్రదేశ్ పోలీసుల కాల్పుల్లో జకీర్, అంజద్, సాలిక్, మెహబూబ్ హతమయ్యారు. కాగా, వీరిపై దేశద్రోహం కేసు ఉందని ఎస్పీ అజయ్ కుమార్ తెలిపారు.
మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ తోపాటు పలు రాష్ట్రాల్లో సిమి ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను రహస్యంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా, 2001లో సిమిపై ప్రభుత్వం నిషేధం విధించింది.