భద్రకాళీ అమ్మవారికి బంగారు బోనం.. చరిత్రలో తొలిసారి.. కానీ
ఆషాడమాసం సమీపిస్తోంది. బోనాల పండుగకు సమయం దగ్గరకు రానే వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ చూడాలి అంటే ముఖ్యంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలజాతర చూడాల్సిందే. హైదరాబాద్, సికింద్రాబాద్ లో జరిగే బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రానికే చాలా స్పెషల్ గా భావిస్తారు. ఇక అటువంటిది ఈసారి వరంగల్ నగరంలో కూడా గతంలో ఎప్పుడూ కనివిని ఎరుగని విధంగా భద్రకాళి అమ్మవారి బోనాల ఉత్సవాన్ని జరపాలని తెలంగాణప్రభుత్వం నిర్ణయించింది.
భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఆషాడ మాసంలో నెలరోజులపాటు నగరంలోని వివిధ ఆలయాలలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలోనూ ఏదో ఒక సందర్భంలో బోనాల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే ఈసారి హైదరాబాద్ బోనాల ఉత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించాలని నిర్ణయం తీసుకుంది.

చరిత్రలోనే తొలిసారి భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం
భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం భద్రకాళి ఆలయ చరిత్రలోనే ఇదే తొలిసారి. వరంగల్ నుండి చారిత్రక భద్రకాళి ఆలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తెలంగాణ ఇంద్రకీలాద్రి గా పేరుగాంచిన ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించడానికి ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. తొలిసారిగా దీన్ని నిర్వహిస్తుండడంతో దీనిపైన స్థానికంగా చర్చ జరుగుతుంది.
ఈనెల 22వ తేదీన అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్న మంత్రి కొండా సురేఖ
శ్రీ మహంకాళి దేవస్థానం లాల్ దర్వాజా వారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి 11 సంవత్సరాలుగా దేశం నలుమూలల బోనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా ఈనెల 22వ తేదీన రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారని భద్రకాళీ దేవస్థానం ఈవో శేషు భారతి తెలిపారు.
భద్రకాళికి బంగారు బోనంపై భిన్నాభిప్రాయాలు
రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పణ పైన వేదపండితులు అర్చకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఆగమ శాస్త్రానికి విరుద్ధమని కొందరు అభిప్రాయపడుతుండగా, ఇప్పటివరకు లేని కొత్త ఆనవాయితీని కేవలం తమ ప్రాభవం కోసం మంత్రి కొండా సురేఖ తీసుకువస్తున్నారని భావిస్తున్న వారు లేకపోలేదు.
ఈ సిద్ధాంతం ప్రకారం అమ్మవారి పూజలు
భద్రకాళి ఆలయంలో దక్షిణాచార శాక్తా ద్వైత వైదిక స్మార్త ఆగమ సిద్ధాంతం ప్రకారం పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. అయితే దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు ఆషాడమాసంలో బంగారు బోనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శేషు తెలిపారు.












Click it and Unblock the Notifications