ఓట్లు అడుక్కోవటానికి వచ్చాను.. దయుంటే ఓట్లేయండి, లేదంటే లేదు: గొంగడి సునీత అసహనం!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. పతాక స్థాయికి చేరుకున్న ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు హోరాహోరీగా ఇంటింటికి తిరుగుతున్నారు. తమకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మక ఎన్నికలు కావడంతో చావో రేవో తేల్చుకోవటం కోసం ఎన్నికల బరిలోకి దిగి ఓటర్ల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా రాజకీయం మారడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తెగ తంటాలు పడుతున్నారు. హోటల్స్ లో టీలు పెడుతూ, దోసెలు వేస్తూ, ఇళ్లకు వెళ్ళిన దగ్గర పిల్లలను ఎత్తుకుంటూ మేము మీలోని వాళ్ళమే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కొందరు అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థిస్తున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి గొంగడి సునీత ఓటర్లను ఓట్లు అడుగుతున్న తీరు ఇప్పుడు అందరినీ షాక్ చేసింది. తాను ఓట్లు అడుక్కోవటానికి వచ్చాను .. దయుంచి నాకు ఓట్లు వెయ్యండి. మీ దయ ఉంటేనే ఓట్లు వెయ్యండి లేదంటే లేదు అంటూ బీఆర్ఎస్ అభ్యర్థి గొంగడి సునీత ఓటర్లను ఓట్ల కోసం అడిగిన తీరు అక్కడివారు అవాక్కయ్యేలా చేసింది .
ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న గొంగడి సునీత యాదగిరిగుట్ట మండలంలోని రాళ్ల జనగాం గ్రామంలో పర్యటిస్తున్న క్రమంలో అక్కడి ప్రజలు బస్వాపురం రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన పలువురు భూ నిర్వాసితులు తాము కోల్పోయిన భూములకు తక్కువ నష్ట పరిహారం వచ్చిందని సరైన న్యాయం జరగలేదని ఆమె ముందు వాపోయారు.
దీనిపై గొంగడి సునీత మాట్లాడుతూ తాను రాళ్ల జనగాం గ్రామం రిజర్వాయర్ లో పోకుండా సాధ్యమైనంత వరకు కృషి చేస్తానని, తాను ఓటు అడుక్కోవడానికి వచ్చానని, ఇష్టమైతే ఓటెయ్యండి లేకుంటే లేదు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వాహనం దిగి అక్కడి నుండి వెళ్ళిపోయారు.












Click it and Unblock the Notifications