వీధికుక్కల దాడిలో మరో బాలుడు మృతి; వరంగల్ లో హృదయ విదారక ఘటన!!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వీధికుక్కల దాడిలో గతంలో ఒక పసివాడిని కుక్కలు పీక్కుతిన్న ఘటన ఇంకా మనందరి కళ్ళముందు కదులుతూనే ఉంది. తాజాగా మరో దారుణ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే క్వార్టర్స్ చిల్డ్రన్ పార్క్ దగ్గర చోటు చేసుకుంది. వీధికుక్కల దాడిలో ఏడేళ్ల చోటు అనే బాలుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
కాజీపేట రైల్వే కాలనీలో బీహార్ కు చెందిన ఓ సంచార జాతికి చెందిన కుటుంబం నిన్ననే పొట్ట చేతపట్టుకుని బతుకుతెరువు కోసం కాజీపేట కు వచ్చారు. అయితే అక్కడ ఆడుకుంటున్న బాలుడి పై రెండు కుక్కలు దాడి చేశాయి. దీంతో బాలుడికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు హుటాహుటిన 108 సహాయంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బాలుడు మరణించాడు.

బాలుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు .వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందరరాజ్ తదితరులు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వీధి కుక్కలను నియంత్రిస్తామని, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ తరపున బాధిత కుటుంబానికి లక్ష రూపాయల పరిహారం అందిస్తామని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు.
మృతదేహాన్ని బీహార్ పంపించడం కోసం ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. కళ్ళముందు ఆడుకుంటున్న కొడుకు వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. నిలువ నీడ లేని ఆ కుటుంబం రోడ్డుపైన ఒక చెట్టు క్రింద బాలుడి శవంతో దీనంగా రోదిస్తుంది. బాలుడి శవాన్ని ముందు పెట్టుకుని మరో పసివాడు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తుంది.
నేడు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ నగరంలోని అభివృద్ధి పనులపై పరిశీలన నిమిత్తం వరంగల్ కు వచ్చారు. ఈ క్రమంలో వరంగల్ నగరంలో వీధి కుక్కల వల్ల జరిగిన ఈ దారుణ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications