తెలంగాణాలో నాలుగుకు చేరిన కరోనా కేసులు: టెన్షన్ లో ప్రజలు
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. తీరని ప్రాణ, ఆర్ధిక నష్టాన్ని మిగులుస్తుంది. ఇక భారతదేశంలోనూ కరోనా కేసుల సంఖ్య 125కి చేరింది . ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాలలో కూడా కరోనా కేసులు నమోదు కావటంతో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే ముగ్గురు కరోనా పాజిటివ్ గా తేలగా తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది.
తెలంగాణలో కరోనా ప్రభావం .. నాలుగో కేసు నమోదు
తెలంగాణను కరోనా భయపెడుతోంది. తాజాగా రాష్ట్రంలో నాలుగో పాజిటివ్ కేసు నమోదైంది. స్కాట్లాండ్ నుంచి వచ్చిన 46 ఏళ్ల వ్యాపారికి కరోనా వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది. ప్రస్తుతం ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఈ నెల 7న హైదరాబాద్ నుంచి స్కాట్లాండ్ వెళ్లారు. 13న స్కాట్లాండ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. 15న కరోనా లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరారు.
ఒకరికి కరోనా నుండి విముక్తి .. ఐసోలేషన్ వార్డుల్లో ముగ్గురు కరోనా బాధితులు
పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన నలుగురిలో ఒకరు ఇటీవల కరోనా ఎఫెక్ట్ తగ్గి డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో ఇటలీ నుంచి వచ్చిన 24 ఏళ్ల యువతి, నెదర్లాండ్ నుంచి వచ్చిన 48 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతున్నారు. ఇక తాజాగా స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యాపారి కూడా ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఇక గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో మరో 20 మంది కరోనా అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. వీరందరి పరీక్షల నివేదికలు ఇంకా రావాల్సి ఉంది.
హైరిస్క్ దేశాల నుంచి వచ్చిన 22 మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స
ఇక కరోనా ప్రభావం ఉన్న హైరిస్క్ దేశాల నుంచి వచ్చిన 22 మందిని వికారాబాద్ జిల్లా అనంతగిరి హరిత హోటల్కు తరలించారు. అక్కడ వారిని ఐసోలేషన్ గదుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరు చైనా, ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, దక్షిణ కొరియాల నుంచి వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. హరిత హోటల్లో వీరికి ప్రత్యేకంగా గదులు కేటాయించారు. అక్కడ మొత్తం 32 గదులున్నాయని, ఒక కుటుంబం మొత్తం ఒకే గదిలో ఉందని అధికారులు తెలిపారు.
Recommended Video
టెన్షన్ పడుతున్న ప్రజలు..అప్రమత్తంగా ప్రభుత్వం
ఇప్పటికే ఆయా దేశాల నుంచి వచ్చిన దాదాపు 107 మందిని గుర్తించే పనిలో అధికారులున్నారు. తగు జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తి మాత్రం భారత్ లో రోజు రోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇక తెలంగాణా సర్కార్ ముందస్తు చర్యల్లో భాగంగా విద్యాసంస్థలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ అన్నిటినీ మూసి వెయ్యాలని , గుంపులుగా జనాలు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసింది.ఇక అన్ని చర్యలు చేపడుతుంది. కానీ ప్రజలు కరోనా కేసులు ఒక్కొక్కటిగా నమోదు అవుతున్న నేపధ్యంలో టెన్షన్ కు గురవుతున్నారు.