అభంగపట్నం కేసులో మరో ట్విస్ట్: ఇదీ అసలు నిజం.. బయటపెట్టిన బాధితులు
అభంగపట్నం: అభంగపట్నం దళితులపై దాడి కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. దాదాపు 20రోజులకి పైనే కనిపించకుండా పోయిన దళిత యువకులు శుక్రవారం మీడియా ముందుకు వచ్చి 'అదంతా సినిమా షూటింగ్' అని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
Recommended Video

ఆ వ్యాఖ్యలపై చర్చ జరుగుతుండగానే.. మరోసారి మీడియా ముందుకు వచ్చిన దళితులు అసలు నిజాన్ని బయటపెట్టారు. మాజీ బీజేపీ నేత భరత్ రెడ్డి బెదిరింపుల వల్లే తాము అబద్దం చెప్పాల్సి వచ్చిందన్నారు. ఇన్ని రోజులు తమను నిర్బంధించి హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో తిప్పారని తెలిపారు.

కనీసం ఇంట్లోవాళ్లతో ఫోన్లు కూడా మాట్లాడనివ్వలేదని, తమను చాలా ఇబ్బందులకు గురిచేశాడని చెప్పారు. శుక్రవారం నాడు బలవంతంగా తమతో మీడియా ముందు అలా మాట్లాడించారని అన్నారు. తమను పంపించబోయే ముందు మీడియాను పిలిపించారని, భరత్ రెడ్డి భయంతోనే ఆత్మరక్షణ కోసం తాము 'సినిమా షూటింగ్' అనే అబద్దాన్ని తెర పైకి తెచ్చామన్నారు.
తమను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన రోజు 10నిముషాలు మీతో మాట్లాడాలని చెప్పి భరత్ రెడ్డి తీసుకెళ్లాడన్నారు. 10నిముషాలు అని చెప్పి 20రోజుల పైనే తమను నిర్బంధించారని అన్నారు. ఇప్పటికైనా భరత్ రెడ్డిని అరెస్ట్ చేస్తేనే తమకు భద్రత ఉంటందని వాపోయారు.
బాధితులు మీడియా ముందు నిజాలు వెల్లడించడంతో భరత్ రెడ్డి కథా-స్క్రీన్ ప్లే-డైరెక్షన్ అసలు బాగోతం బయటపడింది. ప్రస్తుతం దళిత, బహుజన సంఘాలు అభంగపట్నం పోలీసులతో ఇదే విషయమై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా.. ఇప్పటివరకు భరత్ రెడ్డిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమవడం గమనార్హం.












Click it and Unblock the Notifications