షర్మిలకు బాల్క సుమన్ తీవ్ర హెచ్చరిక
హైదరాబాద్: షర్మిల సహా వైఎస్ కుటుంబం మొత్తం తెలంగాణను వ్యతిరేకించిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఆమరణ దీక్షతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని స్పష్టం చేశారు. ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన షర్మిల అడ్డగోలుగా మాట్లాడుతుందని మండిపడ్డారు.
షర్మిల తెలంగాణపై విషం కక్కుతోందంటూ సుమన్ ఫైర్
తెలంగాణ రాష్ట్రంపై షర్మిల విషం కక్కుతోందని మండిపడ్డారు. సంస్కారహీనంగా మాట్లాడితే ఏమైనా జరగొచ్చని సుమన్ హెచ్చరించారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే జరిగే పరిణామాలకు టీఆర్ఎస్ బాధ్యత వహించదన్నారు. అడ్డగోలుగా మాట్లాడే భాషే ఇందుకు కారణం కానుందన్నారు. తమ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై జరిగిన దాడి గురించి గవర్నర్కు తెలియదా? అని సుమన్ ప్రశ్నించారు. షర్మిల తమను దూషించిన విషయం కూడా గవర్నర్ కు తెలియదన్నట్లు ఉందన్నారు. సంస్కారహీనంగా షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నా.. ఏం మాట్లాడొద్దా? అని ప్రశ్నించారు.
వైఎస్ షర్మిలకు బాల్క సుమన్ తీవ్ర హెచ్చరిక
ఎవరిని పడితే ఏది పడితే మాట్లాడితే ఎలా అని షర్మిలను సుమన్ నిలదీశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నల్లిలాగా నలిపేస్తం అని హెచ్చరించారు. తాము అనుకుంటే షర్మిల ఒక్క అడుగు కూడా బయటపెట్టలేదని వార్నింగ్ ఇచ్చారు. సర్పంచ్గా కూడా గెలవని షర్మిల బతుకెంత? అంటూ సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఏ పక్షమో ఎవరికి తెలుసు? అని అన్నారు. ఏపీ సీఎం జగన్, వైయస్సార్టీపీ నేత షర్మిల తెలంగాణను వ్యతిరేకించారని, అందుకు వీడియో ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. నాడు వైఎస్ నంద్యాలలో హైదరాబాద్కు వెళ్లాలంటే వీసా తీసుకొని పోవాలని అన్నారని, గతంలో షర్మిల 'హైదరాబాద్లో సీమాంధ్రులు బ్రతకాలంటే పాకిస్థాన్లో బతికినట్లు' అనే వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు సుమన్.
షర్మిల, జగన్ సహా వైఎస్ కుటుంబం తెలంగాణ వ్యతిరేకమే
వైఎస్ జగన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్లకార్డులు ప్రదర్శించారని బాల్క సుమన్ తెలిపారు. తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని షర్మిల సందర్భం వచ్చినప్పుడల్లా బయటపెడుతున్నారని, వైఎస్ సన్నిహితుడు కేవీపీ రామచందర్ రావు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజ్యసభలో నిరసన తెలిపారన్నారు. తెలంగాణ వ్యతిరేకులు రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. చెన్నూరులో షర్మిల తనపై వ్యతిరేకంగా మాట్లాడితే.. తాను కార్యకర్తలను సముదాయించినట్లు బాల్క సుమన్ తెలిపారు. వైఎస్ కుటుంబంపై తెలంగాణ ప్రజల్లో కోపం ఉందని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని షర్మిల భర్త బ్రదర్ అనిల్ బయ్యారం గనులు కొల్లగొట్టాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అనేక భూ కబ్జాలకు పాల్పడ్డారన్నారు.
షర్మిల భాష మార్చుకోకపోతే.. తమది బాధ్యత కాదన్న సుమన్
షర్మిల తన భాష మార్చుకోకపోతే ఏమైనా అయితే తమకు సంబంధం లేదన్నారు. అసలు దొంగలు ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసునని, కృష్ణా, గోదావరి నీళ్లను ఆంధ్రాకు తరలించింది ఎవరో తెలుసున్నారు బాల్క సుమన్. షర్మిలకు తెలంగాణ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, కిరాయి మనుషుల తోలుబొమ్మల ఆటలను తెలంగాణ ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు సుమన్. తెలంగాణ వనరులను దోచుకున్న ఘనత వైఎస్ కుటుంబానిదని, నాడు మానుకోటలో జగన్ను తెలంగాణ ప్రజలు అడ్డుకున్న చరిత్రను షర్మిల మర్చిపోయారా? అని నిలదీశారు. అడ్డగోలుగా షర్మిల మాట్లాడుతున్న తీరును కూడా ప్రజలు గమనించాలన్నారు. తమ కేడర్ ఇంకా సహనం పాటిస్తోందన్నారు. భవిష్యత్తులో ఏం జరిగిన టీఆర్ఎస్ది బాధ్యత కాదని అన్నారు.