గురిచూసి కొట్టండి మీరే... బీజేపీ మిషన్ 90!!
తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ప్రజలు బిజెపిని ఆదరించడం కోసం బిజెపి శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఒకపక్క ప్రజా గోస.. బిజెపి భరోసా బైక్ ర్యాలీలతో హోరెత్తిస్తూ, మరోపక్క బండి సంజయ్ పాదయాత్రలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, ఇంకోవైపు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ బీజేపీ ముందుకు సాగుతుంది.

తెలంగాణాపై బీజేపీ ఫోకస్
వచ్చే ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం పై ప్రధానంగా ఫోకస్ చేస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం అందుకు తగినట్టుగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది.
ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివిధ సర్వే సంస్థలతో నివేదికలు తెప్పించుకుంటున్న బీజేపీ అగ్రనేతలు, రాష్ట్రస్థాయి నాయకులకు, నియోజకవర్గ స్థాయి నాయకులకు శిక్షణ శిబిరాలను నిర్వహించి ప్రజాక్షేత్రంలోకి ఏ విధంగా వెళ్లాలి? ఏ అంశాలను ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి? వంటి అనేక విషయాలపై అవగాహన కల్పించి, పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.

వచ్చే ఎన్నికలకు బీజేపీ మిషన్ 90
ఇక ఈ క్రమంలోనే తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్న బిజెపి తెలంగాణ రాష్ట్రంలో వచ్చేఎన్నికలలో మిషన్ 90 అమలు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీపరంగా వివిధ స్థాయిలలో నిర్వహించిన అధ్యయనాలలో రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో 70 చోట్ల బిజెపి బలంగా ఉన్నట్టుగా తేలిందని గుర్తించిన బిజెపి అధినాయకత్వం, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మిషన్ 90 అంటే 90 అసెంబ్లీ స్థానాలపై గురిపెట్టి ముందుకు సాగాలని పార్టీ రాష్ట్ర స్థాయి నేతలకు దిశానిర్దేశం చేసింది.

కొత్త వ్యవస్థను తీసుకురానున్న బీజేపీ
ఇక అంతే కాదు నియోజకవర్గ స్థాయిలో కోర్ కమిటీ లను తగ్గించి అసెంబ్లీ పాలక్ వ్యవస్థను తీసుకురానున్నట్టు బిజెపి నిర్ణయించింది. ఇక ఇందులో భాగంగా మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, బిజెపిలో ఇతర ముఖ్య నేతలు తమ సొంత నియోజకవర్గాల్లో మాత్రమే కాకుండా ఇతర చోట్ల కూడా మూడు రోజులపాటు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
అసెంబ్లీ పాలక్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక్క అసెంబ్లీ స్థానం లో అసెంబ్లీ ఇంచార్జ్, అసెంబ్లీ పాలక్ లు, అసెంబ్లీ కన్వీనర్లు, అసెంబ్లీ విస్తారక్ లతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఒక నేతతో కలిపి మొత్తం ఐదుగురు తో నియోజకవర్గాల వారీగా పరిమితంగా కోర్ కమిటీలను ఏర్పాటు చేయడానికి బిజెపి నేతలు నిర్ణయించారు.

బీజేపీ మిషన్ 90 సక్సెస్ కోసం దిశానిర్దేశం
ఇక దీనికి సంబంధించి ఈనెల 30వ తేదీన కమిటీలతో జరిగే సమావేశానికి బి ఎల్ సంతోష్ రానున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా బిజెపి తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలను, ఆపై లోక్సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో పావులు కదుపుతోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం తోపాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి బిజెపి కృషి చేస్తుంది అన్న భరోసాను ప్రజలలో కల్పించాలని అధినాయకత్వం దిశానిర్దేశం చేస్తుంది. బిజెపి మిషన్ 90 సక్సెస్ అయితే తెలంగాణలో అధికార హస్తగతం అవుతుందని భావిస్తుంది.












Click it and Unblock the Notifications