భద్రాద్రి సీతారామస్వామి తిరు కల్యాణోత్సవాలు... కనువిందుగా గరుడాధివాసం పూజలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం.. శ్రీ సీతారామస్వామి కొలువైన కమనీయ క్షేత్రం . రాములవారు నడయాడిన రమణీయ క్షేత్రం . భద్రాద్రి శ్రీ సీతారామ స్వామి వారి వార్షిక తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైన క్షేత్రం భద్రాద్రి . స్వామీ వారి తిరు కళ్యాణోత్సవాలాలో భాగంగా ఏప్రిల్ 11వ తేదీన ధ్వజపటలేఖన కార్యక్రమం ఘనంగా జరిగింది
భద్రాద్రి సీతారామస్వామి బ్రహ్మోత్సవ సంరంభం .. అంకురార్పణతో నేటి నుండి ప్రారంభం
భద్రాద్రి సీతారామ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా, గురువారం గరుడాధివాసం పూజలు నిర్వహించారు. మఠం వద్ద పవిత్ర వస్త్రంపై ధ్వజ పటాన్ని త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి సమక్షంలో లిఖించారు. బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఆటంకాలూ, విఘ్నాలు కలగకుండా గరుత్మంతుడు రక్షగా ఉంటాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే గరుడోత్సవం వేళ పటాన్ని మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ ఆలయానికి తెచ్చి ఉంచడాన్నే 'అధివాసం'గా పేర్కొంటారు. ఇక ఈ రోజు ధ్వజపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణం చేస్తారని స్థానాచార్యుడు స్థలసాయి తెలిపారు. గరుడమూర్తికి పొంగలిని ప్రసాదంగా సమర్పిస్తారు. ఈ వేడుకతో పాటు భేరి పూజ, దేవతాహ్వానం, అగ్ని ప్రతిష్ఠాపనలు ఉంటాయి.
పావన క్షేత్రమైన భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 6 నుండి 20వ తేదీ వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకుఏర్పాట్లు చేశారు భద్రాద్రి దేవాదాయ శాఖ అధికారులు .బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. 12న అంటే నేడు ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 13న ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా జరుగుతుంది. 14న శ్రీ సీతారామ స్వామి వారి కళ్యాణం మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక 15వ తేదీన శ్రీరామ మహా పట్టాభిషేకాన్ని నిర్వహించి దేవస్థానం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించనున్నారు.