చనిపోయిన మహిళ చివరిచూపు కోసం... వాగుదాటి ప్రాణాలకు తెగించి సాహసం చేసిన చత్తీస్గఢ్ గిరిజనులు
భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలు మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. విపరీతంగా కురుస్తున్న వర్షాలతో, వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఎక్కడికక్కడ రహదారులపై వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోనూ మారుమూల ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అయినప్పటికీ చనిపోయిన ఒక బంధువు కడసారి చూపు కోసం చత్తీస్ గడ్ కి చెందిన గిరిజనులు చేసిన సాహసం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
భూపాలపల్లి జిల్లా దూదేకుల పల్లికి చెందిన ఒక మహిళ అనారోగ్యంతో మరణించింది. ఆమె కడసారి చూపు కోసం చత్తీస్ గడ్ నుండి ఆమె బంధువులు 10 మంది ప్రైవేటు వాహనంలో గోవిందరావుపేట మండలం పస్రా - నార్లాపూర్ మీదుగా దూదేకుల పల్లి వెళ్లడానికి వచ్చారు. వర్షాన్ని, వరదలను సైతం లెక్కచెయ్యకుండా కడసారి వీడ్కోలు పలకటానికి వారంతా బయలుదేరారు. వర్షాలతో పస్రా నుండి నార్లాపూర్ వెళ్ళే దారిలో ప్రాజెక్టు నగర్ వద్ద పాముల వాగు రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తోంది.
ప్రమాదకర స్థాయిలో వాగు రోడ్డుపై ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు పీకల్లోతు నీరు రోడ్డుపై చేరటంతో, వాగు ఉధృతి నేపధ్యంలో పోలీసులు రహదారిపై ఎవరు వెళ్లకుండా ట్రాక్టర్లు అడ్డుపెట్టారు. ఎలాగైనా మృతి చెందిన బంధువును చివరి చూపు చూడాలని భావించిన చత్తీస్ గడ్ గిరిజనులు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుని సైతం లెక్కచేయకుండా ఒకరినొకరు చేతులు పట్టుకొని వాగు దాటి దూదేకుల పల్లికి వెళ్లారు. ఇక వాగు దాటి వెళ్లిన వారు ఓ చంటి బిడ్డను సైతం పట్టుకొని వెళ్లడం గమనార్హం.
భారీ వర్షాలతో వెళ్ళలేని స్థితిలో కూడా వారు చేసిన సాహసం చనిపోయిన బంధువు పట్ల వారికి ఉన్న ప్రేమకు, బంధుత్వాలకు, మానవ సంబంధాలకు అద్దం పడుతుంది. కానీ ప్రమాదకరంగా ఉన్న వాగును దాటి వెళ్లడం ప్రాణాలను పణంగా పెట్టడమే అన్న భావన వ్యక్తమవుతోంది. తాజాగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎవరు ఇటువంటి సాహసాలను చేయడం మంచిది కాదని అధికారులు సూచిస్తున్నారు.