దేశం క్రిందికి పోతుంటే తెలంగాణా పైకి పోతుంది; భూముల ధరలకు రెక్కలు అందుకే: సీఎం కేసీఆర్
కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణా రాష్ట్రంలో భూముల రేట్లు పెరిగాయి అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా ఎకరం భూమి 25 లక్షల రూపాయలకు తక్కువ లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయని కేసీఆర్ వెల్లడించారు తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని పేర్కొన్న కెసిఆర్ దేశం మొత్తం కిందికి పోతుంటే తెలంగాణ రాష్ట్రం పైకి పోతుంది అని వ్యాఖ్యానించారు.
ఖబడ్దార్ మోడీ.. తెలంగాణ పులిబిడ్డగా ఢిల్లీకోటను బద్దలు కొడతాం: జాతీయ రాజకీయాలపైనా సీఎం కేసీఆర్
సమైక్య రాష్ట్రంలో చెరువులు నాశనం .. మిషన్ కాకతీయతో కొత్త కళ
అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్ గతంలో ఏనాడూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయలేదని, కొత్త జిల్లాలతో పరిపాలన సులభమైంది అని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిలో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు అని పేర్కొన్న కెసిఆర్ అధికారులందరికీ తన శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని వెల్లడించారు. సమైక్య రాష్ట్రంలో నాశనం చేసిన చెరువులను మిషన్ కాకతీయతో అద్భుతంగా తీర్చిదిద్దారని పేర్కొన్న కెసిఆర్ వాటర్ షెడ్డింగ్ తో భూగర్భ జలాలు బాగా పెరిగాయని వెల్లడించారు. ఉద్యోగుల జీతాలు ఇంకా పెరుగుతాయి అని హామీ ఇచ్చిన కెసిఆర్, దళితులకు అన్ని రంగాలలో రిజర్వేషన్లు కల్పించామని పేర్కొన్నారు.
గత పాలకులవి వట్టి డైలాగులే.. సమైక్య రాష్ట్రంలో తెలంగాణాకు నష్టం
తెలంగాణ రాష్ట్రం రాకముందే ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ లో ఉన్న తన ఇంట్లో మిషన్ కాకతీయ పేరు పెట్టానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇదే సమయంలో తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రైతుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని, 2601 క్లస్టర్ లను నిర్మించిన గొప్ప వ్యక్తి చీఫ్ సెక్రటరీ అంటూ కెసిఆర్ కితాబిచ్చారు. గత పాలకులవి వట్టి డైలాగు లేనని కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సమైక్య రాష్ట్రంలో అన్ని విధాల నష్టం జరిగిందని కానీ ఇప్పుడు తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందని పేర్కొన్నారు కేసీఆర్.
95 శాతం ఉద్యోగాలు స్థానికులకే
95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయంటూ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో విద్యార్థికి 1.25 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నామని రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రంతో కొట్లాడి ఉద్యోగాలలో 95 శాతం రిజర్వేషన్లు పెట్టించామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఉద్యోగాల విషయంలో కొందరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి అని పేర్కొన్నారు కేసీఆర్. గొర్రెల పెంపకంలో తెలంగాణ ఇండియాలో నెంబర్ వన్ స్థానంలో ఉందని వెల్లడించారు.
Recommended Video
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలు మరింత పెరుగుతాయి
పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తుంది అని పేర్కొన్న కెసిఆర్ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలు మరింత పెరుగుతాయని వెల్లడించారు. ఉద్యోగ సంఘాలతో కూర్చొని ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ను సవరించాలని సీఎస్ సోమేష్ కుమార్ కు కు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్ భవనాల్లో ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్న భువనగిరికి చెందిన ఉషా రెడ్డిని ప్రత్యేకంగా స్టేజిపైకి పిలిచి మరీ అభినందించారు సీఎం కేసీఆర్. తెలంగాణలో అపారమైన ప్రతిభ ఉందని చెప్పడానికి ఉషారెడ్డి నిదర్శనమని సీఎం కేసీఆర్ కొనియాడారు. యాదాద్రి కూడా హైదరాబాదులో కలిసిపోయిందని తెలంగాణ రాష్ట్ర సంపద బాగా పెరిగిందని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.