విషాదం: ఒక్కసారిగా వేగం పెంచిన డ్రైవర్: బస్సు కిందపడి కండక్టర్ మృతి
హైదరాబాద్: నగరంలోని వేవ్ రాక్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ కండక్టర్ మృతి చెందారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా తాడూరు గ్రామానికి చెందిన గడ్డం రాములు(55) నగరంలోని మోతీనగర్లో నివాసముంటున్నారు. ఈయన కూకట్పల్లి బస్డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నారు.
కాగా, ఆగస్టు 12వతేదీన రోజువారి విధుల్లో భాగంగా బస్సులో ప్రయాణికులను ఎక్కించుకొని మైత్రీవనంనుంచి నానక్రాంగూడ ఫైనాన్షియల్ జిల్లాలోని వేవ్రాక్ బస్టాప్లో దింపారు. మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లేందుకు డ్రైవర్ కిరణ్కుమార్ బస్సును వేగంగా మలుపుతుండగా వెనుక తలుపునుంచి కండక్టర్ రాములు ఒక్కసారిగా కిందపడ్డారు.

గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపి స్థానికుల సహాయంతో అతన్ని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ రాములు మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసుకొని దర్యాప్తుచేస్తున్నారు. రాములు మరణంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో తన తోటిఉద్యోగి మరణించడంతో ఆ బస్సు డ్రైవర్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.












Click it and Unblock the Notifications