సీఎల్పీ విలీనానికి నిరసనగా 36 గంటల దీక్షకు దిగిన భట్టి ..కోదండరాం మద్దతు
టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి పార్టీ ఫిరాయించేలా చేయడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ 36 గంటల పాటు నిరహారదీక్షను మాజీ సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క శనివారం నాడు ప్రారంభించారు.
సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చెయ్యటంపై భట్టి 36 గంటల పాటు నిరహారదీక్ష
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 19 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. టీఆర్ ఎస్ కు భారీ మెజార్టీ స్థానాలు ఇచ్చి అధికారం కట్టబెట్టినా టీఆర్ ఎస్ మాత్రం ఆపరేషన్ ఆకర్ష అంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన12 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించింది. దీంతో వారు టీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారు. రెండు రోజుల క్రితం సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తూ స్పీకర్కు లేఖ ఇచ్చారు. ఈ 12 మంది లేఖ ఆధారంగా సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాపతంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంది.
మద్దతు పలికిన కోదండరాం ..అన్ని పార్టీలు ఏక కంఠంతో ఖండించాల్సిన సమయం అన్న కోదండరాం
ఇక టీఆర్ఎస్ఎల్పీ లో సీఎల్పీ విలీన ప్రక్రియను నిరసిస్తూ మాజీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క శనివారం నాడు ఇందిరాపార్క్ వద్ద 36 గంటల దీక్షకు దిగారు. ఈ దీక్షకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ కుంతియా, ఆ పార్టీ నేతలు, టీటీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, టీజేసీ చీఫ్ కోదండరామ్ మద్దతు పలికారు. ఇక కోదండరాం మాట్లాడుతూ సీఎల్పీ విలీనాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని డిమాండ్ చేశారు. ఇందిరాపార్క్ దగ్గర కాంగ్రెస్ చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మద్దతు తెలిపారు. పార్టీల వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్లో లేనివారు కాంగ్రెస్ పార్టీని విలీనం చేయాలని ఎలా సమావేశం పెడతారు? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను కలవడానికి స్పీకర్ ఎందుకు సమయం ఇవ్వడంలేదని ఆయన నిలదీశారు.
కాంగ్రెస్ నేతలు భట్టి దీక్షకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చిన ఉత్తమ్
ముఖ్యమంత్రి కేసీఆర్ నీచ రాజకీయం చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం, స్పీకర్ కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ను అణచివేయాలన్న కుట్రలకు దిగితే సహించేది లేదని మీ ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎం అంటేనే కేసీఆర్కు ముద్దు అని ఎద్దేవా చేశారు . కాంగ్రెస్ నేతలంతా భట్టి విక్రమార్క ఆమరణ దీక్షకు సంఘీభావం తెలపాలని కోరారు. దళితుడు ప్రతిపక్ష నేతగా ఉండటం కేసీఆర్కు ఇష్టంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి .