చివరి నిమిషంలో గేమ్ ప్లాన్ మార్చిన కాంగ్రెస్.. రంగంలోకి బీసీ బడా నేతలు
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహమేంటి? టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు పక్కా ప్లాన్ చేసిందా? కాంగ్రెస్ తీసుకుంటున్న కొన్ని ఆకస్మిక నిర్ణయాలు.. ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి. అభ్యర్థులను ప్రకటించే విషయంలో అసెంబ్లీ రద్దు రోజునే 105 స్థానాలకు టీఆర్ఎస్ ఖరారు చేసినా.. కాంగ్రెస్ మాత్రం ఆచితూచి వ్యవహరించిందనేది కొందరి వాదన.
కాంగ్రెస్ రిలీజ్ చేసిన మొదటి మూడు జాబితాల్లో బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించలేదనే ఆరోపణలు వచ్చాయి. అయితే నాలుగో జాబితాలో బీసీ వర్గాలకు చెందిన ఇద్దరు కీలక నేతలకు టికెట్లు కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరించారనేది స్పష్టంగా అర్థమవుతోంది. నామినేషన్లకు గడువు ముగిసే చివరి సమయంలో బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యతో పాటు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ కు టికెట్లు డిక్లేర్ చేయడం చర్చానీయాంశంగా మారింది.

పకడ్బందీ ప్లానా? టీఆర్ఎస్ కు చెక్ పెట్టేనా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలన్నది కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్. అందులోభాగంగా టీఆర్ఎస్ కు చెక్ పెట్టేలా మిత్రపక్షాలతో మహాకూటమిగా ఏర్పడింది. అయితే టికెట్ల పంపిణీలో మొదటినుంచి కూడా కాంగ్రెస్ తీరుపై సొంతగూటి నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. టికెట్లు కేటాయించడంలో ఆలస్యమెందుకుని పార్టీశ్రేణులు మండిపడ్డాయి. అదలావుంటే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం నోరు విప్పలేదు. తన పని తాను చేసుకుపోయింది. సిట్టింగుల మీద సిట్టింగులు పెట్టి పార్టీ అభ్యర్థుల ఖరారులో తనదైన మార్క్ చూపించింది.
టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఆరోపణలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. తెలంగాణ రాష్ట్రాన్ని తమ పార్టీ ఇస్తే.. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇక్కడి ప్రజలను మోసగిస్తోందని చెబుతూ ప్రజల్లోకి వెళుతున్నారు. అయితే అటు టికెట్ల ఖరారు దగ్గర్నుంచి ప్రచార కార్యక్రమాల దాకా కాంగ్రెస్ స్ట్రాటజీ పనిచేస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

బీసీ మంత్రాంగం..! కాంగ్రెస్ కు కలిసొచ్చేనా?
తెలంగాణలో బీసీ ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. బీసీలను ఆకట్టుకుంటే అధికారం ఖాయమనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. మొదటి మూడు జాబితాల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ సముచిత ప్రాధాన్యం కల్పించలేదని బీసీ సంఘాల నేతలు మండిపడ్డారు. అంతేకాదు పొలిటికల్ కోటా కోసం నిరసన గళం వినిపించడమే గాకుండా ఈనెల 17న స్టేట్ బంద్ తలపెట్టారు. ఇక్కడే కాంగ్రెస్ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు తుది జాబితాలో మిర్యాలగూడ టికెట్ కేటాయించారు. అయితే ఆఖరి క్షణంలో అనుహ్యంగా ఆయన పేరు ఖరారు చేయడం కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో భాగమేనంటున్నారు విశ్లేషకులు.
ఇక సికింద్రాబాద్ నియోజకవర్గంలో ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ పేరు డిక్లేర్ చేసింది అధిష్టానం. అప్పట్లో 93 బీసీ కులాల పేరుతో మనపార్టీ స్థాపించారు జ్ఞానేశ్వర్. అనంతరం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అంతకుముదు ఆయన టీడీపీలో కొనసాగారు. రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్మన్ గా పనిచేశారు. ముదిరాజ్ సామాజికవర్గంతో పాటు బీసీ కులాల్లో ఆయనకు మంచిపట్టుంది. దీంతో జ్ఞానేశ్వర్ కు టికెటిస్తే బీసీ కులాల ఓట్లు కాంగ్రెస్ కు కలిసొస్తాయనేది ఒక అంచనా.

ఆ సామాజికవర్గం వైపు కాంగ్రెస్ చూపు
ముదిరాజ్ సామాజికవర్గం బలంగా ఉన్నా.. నాయకుల కొరత ఉందనే అంశంపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందుకే జ్ఞానేశ్వర్ కు టికెట్ ఇస్తే సికింద్రాబాద్ లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలతో పాటు ఆయన వల్ల రాష్ట్రమంతటా పార్టీకి బీసీల ఓట్లు పడతాయనేది అధిష్టానం ఆలోచనగా కనిపిస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ అమలు చేస్తున్న చేపల పంపిణీ సరిగా జరగక ముదిరాజ్ సామాజికవర్గంలో అసంతృప్తి నెలకొందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈక్రమంలో వారికి దగ్గరయితే కాంగ్రెస్ కు ముదిరాజుల ఓట్లు గంపగుత్తగా పడతాయనే ఆలోచనతో కాసానికి టికెట్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది.
అంతేగాకుండా చట్టసభల్లో ఆ సామాజికవర్గానికి చెందిన నేతలకు సరైన అవకాశాలు కల్పించలేదనేది కాంగ్రెస్ ఆరోపణ. అంతేకాదు రాజకీయంగా బీసీలకు టీఆర్ఎస్ సముచిత ప్రాధాన్యం ఇవ్వలేదనే విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించేలా ప్రచార కార్యక్రమాలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అధికారమిస్తే బీసీలకు మేలు చేకూరే పథకాలు అమలు చేయడంతో పాటు వారికి చట్టసభల్లో ఉన్నతమైన అవకాశాలు కల్పిస్తామనేది కాంగ్రెస్ చెబుతున్న మాట. మొత్తానికి నామినేషన్ల పర్వం ముగిసే సమయానికి ఇద్దరు కీలక బీసీ నేతలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. టీఆర్ఎస్ కు ఎలాగైనా చెక్ పెట్టాలనే కాంగ్రెస్ మంత్రాంగం చివరకు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మరి.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications