సూర్యాపేట జిల్లాలో పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ .. ఎందుకంటే
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల తొలివిడత పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో పరిషత్ ఎన్నికల్లో ఊహించని విచిత్ర సంఘటనలతో పాటు పలు ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ సారి తెలంగాణా రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు బ్యాలెట్ ఎన్నికలు కావటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ నేపధ్యంలోనే హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేసిన రాజకీయ పార్టీల నాయకులు పోలింగ్ సమయంలోనూ ఘర్షణలకు దిగుతున్నారు.
తెలంగాణలో జరుగుతున్న తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఓ పోలింగ్ బూత్ వద్ద బాహాబాహీకి దిగారు. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారంటూ ఒకరిపై ఒకరు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఓటు వేస్తామంటూ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఇరు పార్టీల అభ్యర్థులు లోపల ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో వాగ్వాదం మొదలయ్యింది. దీంతో వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. పోలీసులు జోక్యం చేసి ఇరు వర్గాల వారిని శాంతింపజేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.