శ్రీరామనవమి వేడుకలపై కరోనా ప్రభావం .. భద్రాద్రి రామయ్య కళ్యాణానికి భక్తులకు నో ఎంట్రీ
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో దేశ ఆరోగ్య వ్యవస్థ కుదేలవుతుంది . తెలంగాణలో గత ఏడాది కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుండి పండుగలకు ప్రజలు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష అని గతే ఏడాది కరోనా కారణంగా శ్రీరామ నవమి వేడుకల సమయంలో ప్రభుత్వం చెప్పినమాటలు ఈ ఏడు కూడా అమలు చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది .

శ్రీరామనవమి వేడుకలపై కరోనా ప్రభావం ..తెలుగు రాష్ట్రాల్లో కనిపించని సందడి
శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం అట్టహాసంగా నిర్వహించే వారు . వాడవాడలా స్వామి కళ్యాణం లోక కళ్యాణం కోసం నిర్వహించటం ఆనవాయితీ . ఇక భద్రాచలంలో సీతారామ స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా , ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తారు . కానీ కరోనా మహమ్మారి వ్యాప్తి నేపధ్యంలో ఈ ఏడు కూడా శ్రీరామనవమి వేడుకలకు ఇబ్బంది నెలకొంది. బయట కళ్యాణాలు నిర్వహించి గుంపులుగా ప్రజలు ఒక్క చోట చేరవద్దని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

భద్రాద్రిలో రామయ్య కళ్యాణానికి భక్తులకు నో ఎంట్రీ
ఇక భద్రాద్రి రామయ్యకు కరోనా కష్టాలు తప్పలేదు . కరోనా సమయంలో స్వామి కళ్యాణాన్ని వీక్షించటానికి భక్తులకు ఆలయంలోకి అనుమతి నిరాకరించారు. ప్రజలందరూ స్వామి వారి కళ్యాణాన్ని లైవ్ లో చూడాల్సిన పరిస్థితి . ఉదయం 10.30 కు స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా ప్రారంభం కానుంది . మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్ స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు , ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు . రేపు శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది . కరోనా వ్యాప్తి నేపధ్యంలో స్వామి వారి ప్రత్యేక పూజలు , తీర్ధ ప్రసాద వితరణ ఆలయ అధికారులు నిలిపివేశారు.

ఏపీలో ఒంటిమిట్ట , రామతీర్ధం ఆలయాల్లోనూ నిరాడంబరంగా రామనవమి వేడుకలు
ఇక ఏపీలో కూడా రామ కళ్యాణానికి కరోనా ప్రతిబంధకంగా మారింది. ఎలాంటి అత్తాసాలు లేకుండా ఒంటి మిట్ట రామాలయంలో శ్రీ రాముల వారి కళ్యాణం జరగనుంది. అలాగే ప్రముఖ పుణ్య క్షేత్రం అయిన రామ తీర్ధంలో కూడా కరోనా కారణంగా భక్తులు స్వామి కళ్యాణానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది .ఆరు బయట ఘనంగా జరగాల్సిన రామనవమి వేడుకలు ఆలయాల్లోనే కేవలం పూజారులు నిర్వహించనున్నారు . శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖుల రాకపై కూడా సందిగ్ధం నెలకొంది .

కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో ప్రజలు గుంపులుగా చేరవద్దని విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వాలు
ఇప్పటికే కరోనా వ్యాప్తి నేపధ్యంలో కఠిన ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాముల వారి కళ్యాణానికి కూడా జనాలు గుంపులుగా ఒకచోటకు చేరవద్దని చెప్తున్నారు .
కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని సూచిస్తున్నారు . ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు . ఆలయాల్లో మాత్రమే కేవలం అర్చకుల సమక్షంలోనే శ్రీ సీతారామ కళ్యాణం చేయాలన్నారు.












Click it and Unblock the Notifications