ముక్కు రాస్తారా: కెసిఆర్-హరీష్లకు అరుణ, జాబ్ పోతుందని భయంతో మృతి
మహబూబ్ నగర్: మూడేళ్లలో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేయకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ముక్కు నేలకు రాస్తారా? అని గద్వాల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ ఆదివారం సవాల్ చేశారు.
పాలమూరు ప్రాజెక్టు పైన కాంగ్రెస్, టిడిపి, అధికార టిఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోగా, వాటిపై ప్రభుత్వం ఎదురు దాడికి దిగడం సరికాదన్నారు. పాలమూరును మూడేళ్లలో పూర్తి చేయగలరా అని సవాల్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యలలో రెండో స్థానంలో ఉందని, అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుకు తన గురించి మాట్లాడే అర్హత, నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలన పైన చర్చకు రావాలని హరీష్కు సవాల్ చేశారు.
ఉద్యోగం పోతుందని పంచాయతీ కార్మికుడి మృతి
కొద్ది రోజులుగా సమ్మెలో పాల్గొంటున్న ఓ పంచాయతీ కార్మికుడు ఆందోళనతో శనివారం నాడు శిబిరం వద్దే కుప్పకూలి మృతి చెందాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా బూదాన్ పోచంపల్లిలో జరిగింది. బూదాన్ పోచంపల్లికి చెందిన యాదయ్య గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వీపర్గా 35 ఏళ్ల నుంచి పని చేస్తున్నాడు.
పంచాయతీ కార్మికుల నిరసన కార్యక్రమాలకు హాజరవుతున్నాడు. కార్మికులు ఆందోళన చేస్తే ఉద్యోగాలు తీసేస్తామని హెచ్చరికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అనే మానసిక వేధనకు అతను లోనయ్యేవాడు. శనివారం శిబిరానికి హాజరై కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోగా మృతి చెందాడు.
కార్మికుల తరఫున బిజెపి ఎమ్మెల్యే పోరాటం
ఉప్పల్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కార్మికుల తరఫున దీక్ష చేస్తున్నారు. ఆయన దీక్ష ఆదివారం మూడో రోజుకు చేరుకుంది. అందరు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆయన దీక్ష చేస్తున్నారు. ఇటీవల మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం హెచ్చరించగానే విధుల్లోకి హాజరు కాని వారిని తొలగిస్తానని హెచ్చరించింది కూడా.