హుజురాబాద్ ఫలితాలే రిపీట్; వచ్చే ఎన్నికల్లో నియంత కేసీఆర్ కు బుద్ధి చెప్పండి: డీకే అరుణ
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దించాలని, కెసిఆర్ నియంత పాలన కు చరమగీతం పాడాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు పనిచేయాలని పేర్కొన్న డీకే అరుణ హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలే తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా రిపీట్ అవుతాయి అని ధీమా వ్యక్తం చేశారు.

నల్గొండ జిల్లాలో బీజేపీ శిక్షణా తరగతులలో పాల్గొన్న డీకే అరుణ
నల్గొండ జిల్లాలో బీజేపీ జిల్లా శిక్షణా తరగతులకు హాజరైన డీకే అరుణ బీజేపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ "సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్" నినాదంతో సమ్మిళితమైన, అభివృద్ధి ప్రధానమైన, అవినీతి రహితమైన పాలనను అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కేంద్ర పథకాల పై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని బిజెపి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో రానున్నఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, ఆ విధంగా క్షేత్ర స్థాయిలో బీజేపీ శ్రేణులు పనిచేయాలని సూచించారు.

వచ్చే ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండానే
రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార దుర్వినియోగానికి పాల్పడి, కోట్లాది రూపాయల డబ్బులను ఖర్చు చేసి, ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసినా హుజురాబాద్ ఓటర్లు చైతన్యవంతమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్న డీకే అరుణ, హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు రానున్న ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిపీట్ కావాలని, ఆ విధంగా కెసిఆర్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని రెట్టించిన ఉత్సాహంతో బీజేపీ శ్రేణులు పనిచేయ్యాలన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుండే పని చెయ్యాలని డీకే అరుణ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

కేసీఆర్ మోసాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టటమే లక్ష్యం
ఎప్పటికప్పుడు అబద్ధాలు చెబుతూ, ప్రజలను పక్కదారి పట్టిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం లక్ష్యంగా పనిచేయాలని డీకే అరుణ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కావాలనే రైతులను సమస్యల్లోకి నెడుతుంది అని పేర్కొన్న డీకే అరుణ, రైతుబంధుపై అప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పై నెపం మోపి తప్పించుకోవాలనే ప్రయత్నం సీఎం కెసిఆర్ చేస్తున్నారని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి వేస్తే రైతు బంధు ఇచ్చేది లేదని చెప్పడం రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పటమే అని డీకే అరుణ స్పష్టం చేశారు.

రైతులను దగా చేస్తున్న కేసీఆర్ .. డీకే అరుణ ఫైర్
పార్లమెంటులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధాన్యం కొనుగోలు విషయంలో క్లారిటీ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ, రైతులను తప్పుడు సంకేతాలతో మోసం చేస్తోందని మండిపడ్డారు. ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించకుండా వరి వెయ్యొద్దు అని చెప్పటం కరెక్ట్ కాదని మండిపడ్డారు. కేంద్రం ధాన్యం తీసుకోమని ఎప్పుడూ చెప్పలేదని, బాయిల్డ్ రైస్ మాత్రమే తీసుకోమని చెప్పిందని డీకే అరుణ స్పష్టం చేశారు. రైతులను అడుగడుగునా దగా చేస్తున్న కెసిఆర్ సర్కార్ కు చరమగీతం పాడాలన్నారు డీకే అరుణ.












Click it and Unblock the Notifications