కేటీఆర్ ఇలాకాలోనే ఎందుకిలా?: మరో థర్డ్ డిగ్రీ, ఆమె భర్తను మాయం చేసి?..
స్థానిక పోలీసులతో బెల్లం వ్యాపారులు కుమ్మక్కై సదానందంపై అక్రమ కేసులు బనాయించి పట్టణం నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల ఆకృత్యాలు పెరిగిపోతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూలీ నాలీ చేసుకుని జీవనం సాగించే బడుగు జీవులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.
మొన్నటికి మొన్న కడమంచి వెంకటేశ్ అనే దళిత యువకుడిని జేబు దొంగ పేరుతో థర్డ్ ప్రయోగించి మరీ అతని హత్యకు కారణమయ్యారని సిరిసిల్ల జిల్లా పోలీసులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాజాగా వెల్దండ సదానందం అనే ఓ 'టీ' వ్యాపారిపై సైతం పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడమే కాకుండా.. అతన్ని మాయం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అసలేం జరిగింది?:
బాధితుడి భార్య చెప్పిన కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన వెల్దండ సదానందం కొన్నేళ్లుగా వేములవాడ పట్టణంలో టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో తెలంగాణ ఉద్యమంలోను అతను యాక్టివ్ గా పాల్గొన్నాడు. సజావుగా సాగిపోతున్న అతని జీవితాన్ని ఓ మీడియా ఆపరేషన్ కుదిపేసింది.
నకిలీ బెల్లం దందా:
పట్టణంలో జరుగుతున్న నకిలీ బెల్లం దందాను స్థానిక మీడియా బయటపెట్టింది. దానిపై వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో స్థానిక బెల్లం వ్యాపారులంతా ఏకమయ్యారు. మీడియాకు సదానందమే లీకులిచ్చాడని అనుమానించారు. స్థానిక పోలీసులతో బెల్లం వ్యాపారులు కుమ్మక్కై సదానందంపై అక్రమ కేసులు బనాయించి పట్టణం నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు.
థర్డ్ డిగ్రీ:
ఆరు నెలల క్రితం ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్లి వస్తున్న సదానందంను వేములవాడ కానిస్టేబుల్ ఒకరు అడ్డగించారు. నేరుగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి.. లేని పోని ఆరోపణలతో అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అడిగితే.. పోలీసులను తిట్టాడని ఏవో కారణాలు చెప్పినట్టు తెలుస్తోంది. మూడు రోజుల పాటు సదానందంను పోలీసులు చిత్రహింసలు పెట్టారు.
బండబూతులు తిట్టి..
సదానందంను పోలీసులు పట్టుకెళ్లారన్న విషయం తెలుసుకుని అతని భార్య వేములవాడ పోలీస్ స్టేషన్ వెళ్లారు. తన భర్తను చూపించాలని వేడుకున్నారు. పోలీసులు మాత్రం ఆమెను బండబూతులు తిడుతూ.. మరోసారి ఇక్కడికి వస్తే నీ భర్తను ఎన్కౌంటర్ చేస్తామని, రౌడీ షీట్ తెరుస్తామని పంపించేశారు. ఇదే విషయాన్ని ఓ న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు ఎట్టకేలకు తన భర్తను పంపించనట్టు సదానందం భార్య తెలిపారు.
కెటిఆర్ ఇలాకాలో మరో ఘోరం: భర్తను చంపేశారు, భార్యను మాయం చేశారు
రెండు నెలలుగా మాయం:
పోలీసులు విడిచిపెట్టినప్పటి నుంచి సదానందం అప్పుడప్పుడు మాత్రమే వచ్చి తమను కలుస్తుండేవాడని అతని భార్య చెప్పారు. గత రెండు నెలలుగా అది కూడా లేకుండా పోయిందన్నారు. ఆయనను మాయం చేశారని, పోలీసులే తన భర్తను ఎన్కౌంటర్ చేసి ఉంటారని సదానందం భార్య అనుమానిస్తున్నారు. తన భర్తను లేకుండా చేసిన వేములవాడ పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కేటీఆర్ నియోజకవర్గంలోనే ఎందుకిలా?:
బాధితుడు సదానందం భార్య భవాని పియూపీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో కలిసి హైదరాబాద్ లోని హైదర్ గూడ ఎస్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పియూపీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల మాట్లాడారు. కేటీఆర్ నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పేద ప్రజలను చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించారు. దీనిపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించాలన్నారు. ఘటనపై ఈ నెల 27న వేములవాడకు పౌర, ప్రజాసంఘాలతో నిజ నిర్దారణ కమిటీతో వెళ్లనున్నట్టు తెలిపారు.