పిల్లి ఎలుకకు న్యాయం చేస్తదా .. కేసీఆర్ కూడా అంతే ; నయా నిజాం : పాదయాత్రలో ఈటల ధ్వజం
9వ రోజు ఈటల రాజేందర్ ప్రజా దీవెన యాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు 49 గ్రామాల 150 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్ర, ఈరోజు మరో ఐదు గ్రామాలలో కొనసాగనుంది. కమలా పూర్ మండలంలో ప్రజా దీవెన యాత్రలో భాగంగా సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డ ఈటల రాజేందర్ కెసిఆర్ కు నిజాయితీ లేదు, మానవత్వం అసలు లేదు అంటూ మండిపడ్డారు. కేసీఆర్ నయా నిజాం అన్నారు. దళితులతో పాటు, సంచార జాతుల వారికి అందరికీ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బరిగీసి కొట్లాడదామని నిరుద్యోగులకు ఈటల పిలుపు
ఒక్కనాడు కూడా ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రానివాడు కేసీఆర్ అని గుర్తు చేసిన ఈటల రాజేందర్ ప్రగతి భవన్ లో మొదటిసారి అంబేద్కర్ కు దండ వేసి దండం పెట్టారని రాజకీయాలు చేయడం కేసీఆర్ కే సాధ్యం అన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆక్రోశిస్తున్నారు అని, కూలినాలి పనులు చేసుకోలేక తల్లిదండ్రులకు అన్నం పెట్టలేక కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులకు రెండు చేతులెత్తి దండం పెడుతున్నా అన్న ఈటల రాజేందర్ ఎవరూ పిరికివాళ్ళలాగా ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుతున్నానన్నారు. బరిగీసి కొట్లాడదామని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.
మానుకోటలో మా మీద రాళ్ళ దాడి చేసిన వాడు కౌశిక్ రెడ్డి
పెన్షన్లు, రేషన్ కార్డులకు మూడేళ్లుగా సీఎం కేసీఆర్ లాక్ చేసి పెట్టుకున్నారని, నయా నిజాంలా వ్యవస్థను నడిపిస్తున్నారని మండిపడ్డారు ఈటల రాజేందర్. డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని మూడేళ్లయినా దిక్కు లేదన్నారు. 2018లో తనను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు డబ్బులు కెసిఆర్ పంపించాడని సంచలన ఆరోపణలు చేశారు. మానుకోటకు జగన్ రావద్దని వెళితే అక్కడ తమ మీద రాళ్ళతో కొట్టిన వాడు కౌశిక్ రెడ్డి అని, ఇప్పుడు అలాంటి వాడు కేసీఆర్ చంకన చేరాడని విమర్శించారు.
నాయకులను పశువులను కొన్నట్టు కొంటున్న కేసీఆర్
2002లో తాను పార్టీలో చేరిన నాడే తాను పెద్ద వ్యాపారవేత్త అని పత్రికల్లో రాసుకొచ్చాయని ఆ రోజు తాను ధనవంతుడు అని పేర్కొన్నారు ఈటెల రాజేందర్. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్క చేయలేదని స్పష్టం చేశారు. దమ్ముంటే రాజీనామా చేయమంటే, రాజీనామా చేశానని చెప్పిన ఈటల రాజేందర్ అప్పటినుండి నాయకులను పశువులను కొన్నట్టు కొంటున్నారని ఆరోపించారు. కెసిఆర్ వందల కోట్లను ఎదుర్కొనే సత్తా నాకు లేదు.. మీకే ఆ సత్తా ఉంది. అందుకే మీ దగ్గరికి పాదయాత్రగా వచ్చానని, చంపుకుంటారో సాదుకుంటారో మీ ఇష్టం అంటూ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
దళితులారా మళ్ళీ మోసపోకండి అంటూ ఈటల పిలుపు
పిల్లి ఎలుకకు న్యాయం చేస్తదా అని ప్రశ్నించిన ఈటల రాజేందర్ కెసిఆర్ కూడా అంతే అంటూ విమర్శించారు.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి ఐపీఎస్ అధికారి దళిత బిడ్డలకు విద్య నేర్పించారని, అలాంటి వ్యక్తి పిల్లలకు భోజనం పెట్టడానికి డబ్బులు లేవు కానీ, హుజురాబాద్ లో ఎలా ఇన్ని డబ్బులు వచ్చాయి అని ప్రశ్నించారని గుర్తు చేశారు. నిన్న కూడా ఒక హుజురాబాద్ దళితులను మాత్రమే పిలిచి భోజనం పెట్టారంటే , దళితులను మళ్లీ మోసం చేయడానికే అని పేర్కొన్నారు. దళితులారా మళ్లీ మోసపోకండి అంటూ పిలుపునిచ్చిన ఈటల రాజేందర్ కెసిఆర్ నమ్మించి మోసం చేయడంలో దిట్ట అని విమర్శించారు.