గంజాయి దందా: విశాఖ టూ మహారాష్ట్ర వయా హైదరాబాద్; 2.08 కోట్ల విలువైన గంజాయి సీజ్ చేసిన రాచకొండ పోలీసులు
గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడం తెలుగు రాష్ట్రాలకు పెద్ద సవాల్ గా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు,స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, ఎక్సైజ్ అధికారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా, తెలంగాణా రాష్ట్రం భారీ నిఘా పెట్టినా సరే గంజాయి అక్రమ రవాణా సాగుతూనే ఉంది. అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. నిత్యం వాహన తనిఖీలు చేస్తూ గంజాయి దందాను అడ్డుకుంటున్నా, సాక్షాత్తు కేంద్ర హోంశాఖా మంత్రి డ్రగ్స్ ను అరికట్టటం కోసం చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాలకు సూచిస్తున్నా సరే గంజాయి మాఫియా తమ పని తాము చేసుకుపోతున్నారు.
గంజాయి ఎక్కడ దొరికినా కేరాఫ్ మాత్రం విశాఖనే
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఏజెన్సీ గా మారిపోయింది. ఈ మధ్య కాలంలో నిత్యం పట్టుబడుతున్న గంజాయి కేసులన్నీ విశాఖ ఏజెన్సీ నుండి గంజాయి తరలిస్తున్న కేసులే కావటం గమనార్హం. గంజాయి అక్రమ రవాణాకు చెక్ పెట్టడం కోసం దృష్టిసారించిన తెలంగాణ పోలీసులు, మరో మారు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని సీలేరు నుంచి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రాచకొండ పోలీసులు రంగంలోకి దిగారు. భారీగా గంజాయిని సీజ్ చేశారు .
విశాఖ నుండి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ముఠా .. 1240 కిలోల గంజాయి సీజ్
గంజాయి ముఠా ను పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన రాచకొండ ఎస్వోటీ పోలీసులు నగరంలో అనేక చోట్ల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు వాహనాల్లో తరలిస్తున్న 1240 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 2.08 కోట్లుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇంటిలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో అంతరాష్ట్ర గంజాయి ముఠా ను అరెస్ట్ చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. విశాఖ నుండి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా తరలిస్తున్న 1240 కిలోల గంజాయిని పట్టుకున్నామని చెప్పిన పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
గంజాయి తరలిస్తున్న వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ , పీడీ యాక్ట్
ఈ గంజాయిని విశాఖ నుండి మహారాష్ట్రకు తరలిస్తున్నారని షేక్ యాసీన్ అలియాస్ ఫిరోజ్ అనే ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకుడు ఈ గంజాయి దందాను సాగిస్తున్నారని వెల్లడించిన మహేష్ భగవత్, అతనితో పాటు మరో రెండు కార్ల డ్రైవర్లు రవీందర్, మధులు పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలో వాహనాలను వదిలి మొత్తం ముగ్గురు పారిపోయారని పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో మూడు కార్లను, ఐదు వేల రూపాయలు నగదును, రెండు మొబైల్స్ ను, ఆరు ప్లాస్టిక్ బ్యాగులను సీజ్ చేశారని పేర్కొన్నారు. నిందితులపై ఎన్డిపిఎస్ చట్టం తో పాటుగా పిడియాక్ట్ నమోదు చేస్తామని మహేష్ బాబు వెల్లడించారు. ప్రస్తుతం గంజాయి తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Recommended Video
నిత్యకృత్యంగా గంజాయి స్మగ్లింగ్ .. పట్టుబడుతున్న స్మగ్లర్లు
ఇదిలా ఉంటే ఇటీవల సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల దగ్గర ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 26 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే భద్రాచలం బ్రిడ్జి చెక్ పోస్ట్ దగ్గర వాహన తనిఖీలలో భాగంగా మూడు బైక్ లలో అక్రమంగా తరలిస్తున్న రెండు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు బూర్గంపాడు మండలం లోని మోర్గంపల్లి బంజరు ఫారెస్టు చెక్పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించి రెండు బైక్లలో 16 లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు