బోర్బావిలో పడిన చిన్నారి: హమ్మయ్య, బతికింది!
హైదరాబాద్: బోరుబావి పడ్డ చిన్నారి అంజలి (5) క్షేమంగా బయటపడింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బోరుబావిలో పడ్డ చిన్నారిని అధికారులు, స్థానికులు ఐదు గంటల సహాయక చర్యలు చేపట్టి బయటకు తీశారు. చిన్నారి క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప గాయాలపాలైన చిన్నారిని చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రంగారెడ్డి జిల్లా గండేడ్ మండలం గోవిందపల్లి తండాలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి - గోవిందపల్లి తండాకు చెందిన లక్ష్మీ నాయక్, బుచ్చిబాయి దంపతులు ఉపాధి నిమిత్తం వలసవెళ్లారు. వీరి నలుగురు సంతానం ఇద్దరు కుమారులు, కుమార్తెలు అమ్మమ్మ వద్దే ఉంటున్నారు. సంతానంలో మూడో చిన్నారి అంజలి (5) మంగళవారం బావి దగ్గరికి అమ్మమ్మతో కలిసి వెళ్లింది. అక్కడ అందరూ పనిలో ఉండగా చిన్నారి అంజలి ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు పొలంలోని బోరు బావిలో పడిపోయింది.
దాదాపు పది అడుగుల లోతున్న బోరు బావిని రెండేళ్ల క్రితం తవ్వారు. చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెతుకుతుండగా బోరు బావి నుంచి అరుపులు వినిపించాయి. అప్రమత్తమైన వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది పైపు ద్వారా బోరు బావిలోకి ఆక్సిజన్ అందిస్తూ దాదాపు ఐదు గంటలపాటు శ్రమించి చిన్నారిని క్షేమంగా బయటకుతీశారు.
స్వల్ప గాయాలతో షాక్కు గురైన చిన్నారి అంజలిని మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారిని క్షేమంగా ఉన్నట్లు తెలిసింది.