కూకట్పల్లిలో కేసీఆర్కు మరో ఊహించని షాక్, కీలక నేత రాజీనామా: ఆయన ఏం చేస్తారు?
హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అధికార టీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇటీవల చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి, ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే సంజీవ రావు తెరాసకు రాజీనామా చేశారు. తాజాగా, కూకట్పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ గొట్టిపాటి పద్మారావు.. కేసీఆర్కు షాకిచ్చారు.
మహాకూటమి తరఫున కూకట్పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి సుహాసిని పోటీ చేస్తున్నారు. మరోవైపు, 2014లో టీడీపీ నుంచి గెలిచిన మాధవరం కృష్ణారావు ఆ తర్వాత తెరాసలో చేరి, ఇప్పుడు అదే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గం ఇటు మహాకూటమికి, అటు తెరాసకు కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో తెరాసకు ఊహించని షాక్ తగలింది.
కేసీఆర్ను ఓడించి, గజ్వెల్ను సోనియా గాంధీకి బహుమతిగా ఇస్తా: వంటేరు సవాల్
తెరాసకు గొట్టిముక్కల రాజీనామా
కూకట్పల్లి టీఆర్ఎస్ ఇంచార్జ్ గొట్టిముక్కల పద్మారావు తెరాసకు రాజీనామా చేస్తూ, తన రాజీనామా పత్రాన్ని అధినేతకు పంపించారు. ఈ లేఖలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. పార్టీని ఇల్లులా, కేసీఆర్ను ఇంటికి పెద్ద దిక్కులా (తండ్రిలా) భావించానని, పార్టీలో ఇన్నాళ్లు చాలామందికి అన్యాయం జరిగినా ఓఫికతో సహించానని, ఇకనైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశతో ఎదురు చూశానని, అయినా మార్పు రాలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.
తెరాసకు గట్టి షాక్
పార్టీ పక్కదారి పడుతోందని గొట్టిముక్కల పద్మారావు అన్నారు. ఇక పార్టీ గాడిలో పడదని భావించి, తాను కూకట్పల్లి పార్టీ ఇంచార్జి పదవికి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. కేసీఆర్కు చాలా సన్నిహితంగా ఉండే గొట్టిముక్కల రాజీనామా చేయడం నియోజకవర్గంలో గట్టి షాక్ అని చెప్పవచ్చు. ఆయన రాజీనామా మహాకూటమికి ప్లస్ అవుతుందని చెబుతున్నారు.
గొట్టిముక్కల ఏం చేస్తారు?
పార్టీకి రాజీనామా చేసిన గొట్టిముక్కల పద్మారావు తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించలేదు. ఏదైనా పార్టీలో చేరుతారా లేక రాజకీయాలకు దూరంగా ఉంటారా చూడాల్సి ఉంది. గొట్టిముక్కల 2014లో తెరాసలో చేరారు. అప్పుడు మాధవరం కృష్ణారావు చేతిలో ఓడిపోయారు.
తలసాని, మాధవరం ప్రత్యేక టార్గెట్
2014లో టీడీపీ నుంచి గెలిచి, ఆ తర్వాత తెరాసలో చేరిన పలువురు నేతలను టీడీపీ అధిష్టానం టార్గెట్గా పెట్టుకుంది. ముఖ్యంగా సనత్ నగర్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ను, కూకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావును ఓడించాలనే కసితో ఉంది. ఇందులో భాగంగా కూకట్పల్లి నుంచి సుహాసినిని బరిలోకి దింపింది. సనత్ నగర్ సీటు కాంగ్రెస్ సీనియర్ మర్రి శశిధర్ రెడ్డికి వస్తుందని అందరూ భావించారు. కానీ సనత్ నగర్లో పోటీ చేస్తున్న తలసానిని టీడీపీ అభ్యర్థి చేతిలోనే ఓడించాలనే ఉద్దేశ్యంతో ఆ సీటును కూటమి పొత్తులో భాగంగా టీడీపీ తీసుకుందని చెబుతున్నారు.