డికె అరుణ ఏపీలో హారతి పట్టారు: హరీష్ నోట పలుమార్లు కొడంగల్
హైదరాబాద్: పాలమూరు నీళ్లు అనంతపురం తరలించుకుపోతే కాంగ్రెస్ నేత డికె అరుణ అక్కడ హారతి పట్టారని మంత్రి హరీష్ రావు సోమవారం ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొందరు టిఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
కెసిఆర్ పట్టుబడితే నూటికి నూరు శాతం ఏదైనా జరుగుతుందన్నారు. పాలమూరు ప్రాజెక్టు కూడా నిర్మాణం జరుగుతుందన్నారు. 2001లో కెసిఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు అందరు అనుమానం వ్యక్తం చేశారని, కానీ మనం సాధించామన్నారు.
పాలమూరు ప్రాజెక్టు ద్వారా అత్యధిక నీరు వచ్చేది కొడంగల్ నియోజకవర్గానికే అన్నారు. అత్యధిక సాగు కొడంగల్ నియోజకవర్గంలోనే అవుతుందన్నారు. కెసిఆర్ ఇంజినీర్ అవతారం ఎత్తి ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారన్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువ నీళ్లు పారుతాయని, హక్కుదారులం మనం అయితే, నీళ్లు తీసుకుపోయింది ఆంధ్రావాళ్లు అన్నారు. ఇప్పుడు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాదులోనే కాకుండా కొడంగల్, గద్వాల్ నియోజకవర్గాలకు కూడా 24 గంటల విద్యుత్ ఇస్తామన్నారు.
రానున్న రోజుల్లో రైతాంగానికి తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తామని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా కొడంగల్లో లక్షా ఎనిమిది వేల ఎకరాలకు సాగు నీరు వస్తుందని చెప్పారు. పాలమూరు కరువును పారదోలుదామన్నారు. గత నాయకులు కమీషన్ల కోసం ప్రాజెక్టులు కట్టారన్నారు.
కొడంగల్లో మనకు తిరుగు లేదన్నారు. అభివృద్ధి చేసేందుకు కెసిఆర్ ఉన్నారన్నారు. కొడంగల్ ప్రజలు ఏకతాటి పైన నిలిస్తే తట్టుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. పాలమూరు ఎత్తిపోతలకు వారం రోజుల్లో భూసేకరణ నోటిఫికేషన్ వస్తుందన్నారు. రైతులకు న్యాయం చేసి భూములు తీసుకుంటామన్నారు.
షాదీ ముబారక్తో పేద ముస్లీంలకు రూ.51 వేలు ఇస్తున్నామని చెప్పారు. కెసిఆర్ ఎన్నో చేశారన్నారు. దొడ్డు బియ్యం తీసేసి సన్నబియ్యం ఇస్తున్నామని, ఒక్కో ఇంటికి వచ్చే బియ్యం పెరిగాయన్నారు. ముస్లీం కుటుంబాల్లో ఎక్కువ మంది ఉంటారని, వారికి కూడా సరిపోయేన్ని బియ్యం ఇస్తున్నామన్నారు.
కాంగ్రెస్, టిడిపిలు మాటలు చెప్పాయే తప్ప ప్రాజెక్టులు పూర్తి చేసింది లేదన్నారు. కెసిఆర్ ఆలోచన అంతా పేద ప్రజల కోసమే అన్నారు. అంతరం కలిసి మహబూబ్ నగర్ జిల్లాను ముందుకు తీసుకు పోదామని చెప్పారు. ఎవరికి ఇబ్బంది వచ్చినా అధైర్యమొద్దని, మీ వెనుక టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందని, కెసిఆర్ ఉన్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన పడవ అన్నారు. అది ఢిల్లీలో మునిగింది, గల్లీలో మునిగిందన్నారు. మహబూబ్ నగర్కు రావాల్సిన నీరు అనంతపురం తరలించుకుపోతే నాటి మంత్రి డికె అరుణ అక్కడ మంగళహారతి పట్టారని ఎద్దేవా చేశారు. నేటి ప్రభుత్వం అలాంటిది కాదన్నారు.