ఆర్థిక స్థోమత లేదు: 'హర్షితకు ఆపరేషన్ చేస్తేగాని బతకదని వైద్యులు చెప్పారు'
హైదరాబాద్: కాలేయ వ్యాధితో బాధపడుతున్న తమ కుమార్తె కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా జగద్గిరి గుట్టకు చెందిన చిన్నారి హర్షిత తల్లిదండ్రులు మానవ హక్కుల సంఘానికి విజ్ఞప్తి చేసుకున్న సంఘటన గురువారం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శివారులోని జగద్గిరి గుట్టకు చెందిన 11 ఏళ్ల హర్షిత గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతోంది. చిన్నారి శస్త్రచికిత్స కోసం రూ. 25 నుంచి 30 లక్షల వరకు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు రామచంద్రారెడ్డి, శ్యామల వెల్లడించారు.
అయితే అంత మొత్తాన్ని భరించే శక్తి లేకపోవడంతో తమ కుమార్తెను కారుణ్య మరణం పొందే విధంగా అనుమతించాలని హెచ్చార్సీని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గురువారం చిన్నారి హర్షిత తల్లి శ్యామల ఓ టీవీ ఛానెల్లో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.
తమ కూతురుకు ఆపరేషన్ చేయించే ఆర్థిక స్థోమత లేదని, తమ కుమార్తె కారుణ్య మరణానికి అనుమతించాలని కోరామన్నారు. తమ కుమార్తెకు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారని, అందుకు రూ. 25 నుంచి 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఏసియన్ ఆసుపత్రి వైద్యులు చెప్పారని ఆమె అన్నారు.
అంత ఆర్థిక స్థోమత తమకు లేదని, దీంతో ఏమి చేయాలో తెలియక ఆసుపత్రి నుంచి బయటకు వచ్చామని అన్నారు. ఆ తర్వాత కేర్ ఆసుపత్రికి వెళితే అక్కడి వైద్యులు తమ కుమార్తెకు పరీక్షలు నిర్వహించారని, మందులు ద్వారా నయం చేయాలని చూశారని ఆమె తెలిపారు.
అయితే అదీ కూడా సాధ్యపడలేదని, హర్షితకు ఆపరేషన్ చేస్తేగాని బతకదని వైద్యులు చెప్పారని అన్నారు. పాప పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని, రెండు వారాల్లో ఆపరేషన్ చేయకపోతే హర్షిత తమకు దక్కదని చెప్పారంటూ ఆమె తల్లి కన్నీటి పర్యంతమయ్యారు.