కేసీఆర్ ఆపరేషన్ కొడంగల్: రేవంత్ టార్గెట్గా తెరాసకు 5సార్లు ఎమ్మెల్యే అండ, హ్యాట్రిక్ కొట్టేనా?
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాననే ధీమాతో ఉన్నారు. 2007లో ఎమ్మెల్సీగా అడుగుపెట్టిన ఆయన 2009, 2014లలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల ఆయన ఇంట్లో దాదాపు మూడ్రోజుల పాటు ఐటీ సోదాలు చేసిన విషయం తెలిసిందే.
రేవంత్పై ప్రశ్నల వర్షం, భార్యను బ్యాంక్కు తీసుకెళ్లిన అధికారులు: హాంకాంగ్లో ఖాతా, ఎవరీ మురళి?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే చాలా స్థానాల్లో ఎవరికి టిక్కెట్లు వస్తాయో ముందే తెలుసు. ఇందులో భాగంగా కొడంగల్ నుంచి రేవంత్ పోటీ చేసే అవకాశముంది. కొడంగల్ నుంచి ఈసారి రేవంత్ గెలిచినా లేక తెరాస పట్టు సాధించినా రికార్డే. మళ్లీ గెలిస్తే రేవంత్ హ్యాట్రిక్ సాధిస్తారు.
కొడంగల్లో ఎవరు గెలిచినా రికార్డ్
తెలంగాణ రాష్ట్ర సమితి గెలిస్తే మాత్రం ఆ పార్టీకి కొడంగల్లో ఇది తొలిసారి గెలుపు అవుతుంది. అంతేకాదు, కేసీఆర్ను ధీటుగా ఎదుర్కొంటున్న నాయకుడు రేవంత్ను మట్టికరిపించిన ఆనందం తెరాసలో మామూలుగా ఉండదు. కానీ రేవంత్ను ఓడించడం అంత సాధారణమైన విషయం కాదని అంటున్నారు. ఆయనకు స్థానికంగా గట్టి పట్టు ఉంది. నియోజకవర్గంలో మంచి పేరు ఉంది.
రేవంత్ ఓటమే లక్ష్యంగా కేసీఆర్
రేవంత్ నిత్యం కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారు. అలాంటి రేవంత్ను ఓడించేందుకు తెరాస ఆపద్ధర్మ మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడిని రంగంలోకి దింపింది. కేసీఆర్ పలువురు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో కొడంగల్ నుంచి మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డికి ఇచ్చారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. రేవంత్ ఓటమే లక్ష్యంగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలనూ వేగంగా చేశారు. రేవంత్ ఓటమికి కేసీఆర్, తెరాస అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటోంది.
రేవంత్ పైన మంత్రి సోదరుడు పోటీ
నరేందర్ రెడ్డి గత రెండేళ్లుగా కొడంగల్ నియోజకవర్గంపై దృష్టి సారిస్తున్నారు. తెరాస నుంచి టిక్కెట్ పైన ఎప్పుడో హామీ రావడంతో అతను నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, గ్రౌండ్ లెవల్లో పని చేస్తూ వస్తున్నారు. ఇఖ్కడి నుంచి రేవంత్ను ఓడించడమే టార్గెట్గా పెట్టుకున్నారు. నరేందర్ రెడ్డి కొడంగల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల కోసం తెరాస ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు.
కేసీఆర్ పథకాలే గెలిపిస్తాయని
కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే కొడంగల్లో తనను గెలిపిస్తాయని నరేందర్ రెడ్డి చెబుతున్నారు. కొడంగల్లో సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను తన వైపు రప్పించుకునేందుకు తెరాస చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. చాలామంది ఇప్పటికీ రేవంత్ వెంటే ఉంటున్నారు.
5సార్లు ఎమ్మెల్యే మద్దతు నరేందర్ రెడ్డికే
పదకొండుసార్లు పోటీ చేసి, 5సార్లు కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన గురునాథ్ రెడ్డి తెరాస అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతు పలుకుతున్నారు. గతంలో ఆయన తెరాస తరఫున రేవంత్ పైన పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్ పార్టీ గురునాథ్ రెడ్డికి టిక్కెట్ నిరాకరించింది. దీంతో ఆయన తెరాసలోకి జంప్ అయి, లాస్ట్ మినట్లో టిక్కెట్ తెచ్చుకున్నారు. కానీ ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి విట్టల్ రెడ్డి అప్పుడు మూడోస్థానంలో నిలిచారు. గురునాథ్ రెడ్డి తమకు మద్దతిస్తున్నారని, అలాగే కాంగ్రెస్, టీడీపీ క్యాడర్ తెరాసలో చేరిందని, కాబట్టి రేవంత్ ఓటమి ఖాయమని తెరాస నేతలు చెబుతున్నారు.
సత్తా చాటుతున్న రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి ఇటీవల 30 కిలోమీటర్ల ర్యాలీతో తన సత్తా చాటారు. ఓ వైపు, ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నా బెదరకుండా ఆయన జోరుగా ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారానికి, ర్యాలీకీ పెద్ద ఎత్తున మద్దతు లభించింది. నేను జైలుకు వెళ్లినా 50వేల ఓట్లతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్లో ఆయన ఓటమి దాదాపు కష్టమే అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. గతంలో ఓ సర్వేలో కేసీఆర్ తర్వాత రేవంత్ అని వచ్చింది. ఎంతమంది తెరాసలోకి వెళ్లినా, ఎంత బలమైన వ్యక్తిని తనపై నిలబెట్టినా.. ప్రజాబలంతో గెలుపు మాత్రం రేవంత్దేనని అభిమానులు అంటున్నారు.