వడదెబ్బతో 34మంది మృతి.. ఎండల్లో ప్రాణాల మీదకు తెచ్చుకోకండి!
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రోళ్ళు పగిలే ఎండలు ప్రజలను అల్లాడిస్తున్నాయి. దీంతో తెలంగాణలో వేడి తీవ్రత అత్యధిక స్థాయికి చేరుకుంది. ఎండల ప్రభావంతో వడదెబ్బకు గురై వివిధ జిల్లాల్లో 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ మరణాలు రోడ్డుపై పడిపోవడం, ఇంట్లోనే అస్వస్థతకు గురికావడం వంటి వివిధ సందర్భాల్లో సంభవించాయి. వృద్ధులు, పిల్లలు, కూలీలు, రైతులు వంటి వారు ఎక్కువగా ఈ ఎండల తీవ్రతకు బలైనట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ కారణంగా పెరుగుతున్న మృతులు
నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం దర్యాపూర్లో రాజేశ్వర్, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో తాపీమేస్త్రీ శ్రీనివాస్, మోరపల్లిలో కర్నె లచ్చయ్యలు వడదెబ్బకు గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. నేరడిగొండ మండలం బోరిగాంలో జాదవ్ లతాబాయి, తలమడుగు మండలం కుచులాపూర్లో ఆత్రం రాము, ఉట్నూరు మండలం ఘన్పూర్లో కోవ కిరణ్కుమార్ మృతి చెందారు.

వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయిన వారిలో చిన్నారి కూడా
పెద్దపల్లి జిల్లాలో రామినేని మల్లయ్య, అబ్బాస్ ఖాన్ , సంగారెడ్డి జిల్లాలో గైని సంజీవ్, కవిత దంపతుల కుమార్తె కీర్తన వంటి చిన్నారి కూడా ఈ ఎండల తీవ్రతకు బలయ్యారు. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాల్లోనూ అనేక మంది వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు.
వడదెబ్బ విషయంలో ప్రజలకు ప్రభుత్వం అలెర్ట్
వడదెబ్బ తీవ్రత కారణంగా రాష్ట్రంలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా అప్రమత్తమై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, గొడుగు వంటివి వాడటం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
తెలంగాణాలోని అనేక జిల్లాలకు రెడ్ అలెర్ట్
ఈ ఏడాది వేసవి సాధారణం కంటే ఎక్కువ వేడిని నమోదు చేస్తోంది. వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ జారీ చేసి ప్రజలను జాగ్రత్తగా ఉండాలని కోరింది. వడదెబ్బ నివారణకు ప్రభుత్వం ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ, రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తోంది. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బయట పనులు చేసే వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వేడి తీవ్రత ఇంకా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications