హుజురాబాద్ ఉప ఎన్నికల పోరు: టెన్షన్ లో ఈటల; టీఆర్ఎస్ నేతల్లోనూ ఆందోళన; ఏం జరుగుతుందంటే
హుజురాబాద్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. హుజురాబాద్ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 30వ తేదీన జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రలోభాల పర్వానికి తెరతీశాయి. ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ వందల కోట్ల రూపాయలను ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి ఖర్చు చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. టిఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కోవడానికి బిజెపి కూడా ఓటర్లను ప్రలోభ పెట్టడం మొదలు పెట్టిందని టాక్ వినిపిస్తుంది. అయితే అధికార పార్టీలా బీజేపీ ఖర్చు చెయ్యలేదని టాక్ వినిపిస్తుంది.
బీజేపీ నేతలను తమవైపుకు తిప్పుకుంటున్న టీఆర్ఎస్
హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలను టిఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, మంత్రులు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ వ్యూహాత్మకంగా బిజెపికి చెక్ పెడుతున్నారు. బీజేపీకి మద్దతు ఇచ్చే వర్గాలను గుర్తించి వారు బీజేపీకి మద్దతు ఇవ్వకుండా ఉండేలా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వారిని సైతం వెళ్ళకుండా ఆపుతున్నారు.
మొన్నటి వరకు ఈటల రాజేందర్ వెంట తిరిగిన వారు ఒక్కసారిగా టిఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపడం అందుకు ఉదాహరణగా కనిపిస్తుంది. ఈటల రాజేందర్ వెంట ఎవరు తిరుగుతున్న వారందరినీ తమవైపు తిప్పుకోవడంలో టిఆర్ఎస్ పార్టీ నేతలు సక్సెస్ అవుతున్నారు.
టీఆర్ఎస్ వ్యూహానికి టెన్షన్ పడుతున్న ఈటల రాజేందర్
ఈటల రాజేందర్ ను ఒంటరి వాడిని చెయ్యాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఈటల రాజేందర్ కు, బీజేపీకి బలముందో, అక్కడే బిజెపి బలం మీద దెబ్బ కొడుతున్నారు. ఈటెల రాజేందర్ కు అడుగడుగునా చెక్ పెడుతున్నారు. దీంతో ఈటల రాజేందర్ తీవ్రమైన టెన్షన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ పై పోరాటం చేస్తున్నప్పటికీ, ఈ పోరాటంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన అటు ఈటల రాజేందర్ లోను వ్యక్తమవుతున్నట్లుగా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఎక్కడికక్కడ బిజెపికి సహాయం చేసే వారిని, మద్దతు తెలిపిన వారిని, అనుయాయులను టిఆర్ఎస్ పార్టీ గులాబీ బాట పట్టిస్తుంది. ఈ పరిస్థితులు ఈటల రాజేందర్ కు ఏమాత్రం జీర్ణం కావడం లేదని సమాచారం.
ఎన్ని ప్లాన్స్ వేసినా సరే .. టీఆర్ఎస్ కూ హుజురాబాద్ టెన్షన్ ..
ఇక మరో పక్క టిఆర్ఎస్ పార్టీ సైతం ఎన్ని వ్యూహాత్మక ఎత్తుగడలు వేసినా ఏం జరుగుతుందోనన్న ఆందోళనలోనే ఉంది. ఈటల రాజేందర్ కు ప్రజా మద్దతు ఎక్కువగా ఉండటం ఒక కారణమైతే, ఈసారి ఎన్నికలలో అధికార పార్టీ సింబల్ కు పోలిన సింబల్స్ తో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువగా బరిలోకి దిగడం టీఆర్ఎస్ పార్టీకి టెన్షన్ గా తయారైంది. ఈటల రాజేందర్ ను ఎలాగైనా ఓడించాలని గులాబీ బాస్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన గులాబీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ బిజెపి వ్యూహాలకు చెక్ పెడుతూ పోతున్నా తీరా ఎన్నికల పోలింగ్ నాటికి ఏం జరుగుతుందోనన్న ఆందోళన వారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
కారు గుర్తును పోలిన గుర్తులతో గులాబీ పరేషాన్
కారు గుర్తును పోలిన గుర్తులతో ఇండిపెండెంట్లు ఎన్నికల బరిలో ఉండటంతో, చాలా మంది వృద్ధులైన ఓటర్లు కార్ గుర్తుకు ఓటు వేయబోయి పొరపాటున రోడ్ రోలర్, హెలికాఫ్టర్, చపాతి మేకర్ లాంటి గుర్తులకు ఎక్కడ ఓటేస్తారో అన్న ఆందోళన వ్యక్తమౌతుంది. ఈసారి హుజురాబాద్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచి అవకాశం లేదని సర్వేలు సూచిస్తున్న నేపథ్యంలో కొద్దిపాటి మెజారిటీ నే అవకాశం ఉందని టిఆర్ఎస్ వర్గాలు సైతం నమ్ముతున్న తరుణంలో ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులు ఎక్కడ టీఆర్ఎస్ పార్టీని మోసం చేస్తాయో అన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్; ఆరోపణల వెనుక ఓటమి ఆందోళన
ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ డబ్బుల వరద కురిపిస్తుందని, హుజురాబాద్ లో మద్యం ఏరులై పారుతుందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అధికార దుర్వినియోగానికి టీఆర్ఎస్ పార్టీ పాల్పడుతుందని బీజేపీ నేతలు విమర్శలు మొదలు పెట్టారు. ఈ విమర్శల వెనుక బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఇక కాంగ్రెస్, బీజేపీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని, అందుకే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టి బీజేపీ నుండి బరిలో ఉన్న ఈటలకు సపోర్ట్ చేస్తుందని టీఆర్ఎస్ పార్టీ మంత్రులు చేస్తున్న విమర్శలు కూడా ఓటమి భయంతోనే అన్న ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు . మొత్తానికి టీఆర్ఎస్, బీజేపీ నేతలకు ఎన్నికల్లో ఏం జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తం అవుతుంది.
Recommended Video
హుజురాబాద్ ఓటర్ల మద్దతు ఎవరికో?
టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను రంగంలోకి దింపినప్పటికీ, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను కాకుండా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ బిజెపి నాయకులు విమర్శలు చేయడం, ఈటల రాజేందర్ ను టార్గెట్ చేస్తూ మంత్రులు రంగంలోకి దిగటం చూస్తే టిఆర్ఎస్ అధినాయకత్వానికి ఈటల రాజేందర్ కు మధ్య ఉప ఎన్నిక పోరు జరుగుతున్నట్లుగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే చావో రేవో తేల్చుకుందామని ఈటల రాజేందర్ శతవిధాలా ప్రయత్నం చేస్తుంటే, ఎలాగైనా గెలిచి తీరాలని టిఆర్ఎస్ పార్టీ నేతలు తెగ కష్టపడుతున్నారు. మరి హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారు? ఎవరిని గెలిపిస్తారు? అన్నది మరో కొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఈ ఎన్నికలతో ఎవరు ఎవరికి చెక్ పెడతారో అటుంచి నేతల టెన్షన్ మాత్రం వర్ణనాతీతంగా మారిందని సమాచారం.