స్నేహితుడ్ని బస్సెక్కించేందుకు వెళ్లి: ఇద్దరు విద్యార్థినుల దుర్మరణం
హైదరాబాద్: మిత్రుడిని బస్సు ఎక్కించి తిరిగి కాలేజీకి వెళ్తున్న విద్యార్థులను మృత్యు రూపంలో వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. ఇద్దరు విద్యార్థునిలు దుర్మరణం చెందగా మరో విద్యార్థి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఈ సంఘటన శుక్రవారం రాత్రి రాజీవ్ రహదారి అలియాబాద్ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. రాజస్థాన్కు చెందిన పల్లవీ గుప్తా, చెన్నైకి చెందిన వీణ మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం జగ్గంగూడ గ్రామ పరిధిలోని నిక్మార్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు.
శుక్రవారం రాత్రి తమ మిత్రుడు చిరంజీవి మెహతాను నాగపూర్ వెళ్లేందుకు బస్సు ఎక్కించారు. ఆ సమయంలో వారితో పాటు కుశాల్ అనే మరో స్నేహితుడు ఉన్నాడు.
కుశాల్, వీణ, పల్లవిలు స్కూటీపై కొంపల్లి నుంచి జగ్గంగూడలోని కాలేజీకి బయలుదేరారు. రాజీవ్ రహదారి శామీర్ పేట మండలం అలియాబాద్ చౌరస్తా వద్దకు రాగానే వెనుక నుంచి ఓ లారీ వారిని ఢీకొట్టింది. ఇద్దరు యువతులు తీవ్ర గాయాలతో అక్కడే మృతి చెందారు. కుశాల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.