ఆరోగ్యశ్రీలో కరోనా వైద్యం... ప్రజారోగ్య ఆమరణ నిరాహార దీక్షలో ఎమ్మెల్యే సీతక్క డిమాండ్
కాంగ్రెస్ పార్టీ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రజా ఆరోగ్య ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ అందరికీ .. అన్నిటికీ అంటూ ప్రజారోగ్య ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించిన ఎమ్మెల్యే సీతక్క ఇందిరా పార్క్ వద్ద తన నిరాహార దీక్షను చేపట్టారు.
Recommended Video
ఆరోగ్యశ్రీ ద్వారా కరోనా వైద్యం అందించాలని సీతక్క డిమాండ్
ఆరోగ్యశ్రీ ద్వారా కరోనా వైద్యం అందించాలని, ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయాలని, కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి వాళ్ళు హాస్పిటల్స్ లో కట్టిన బిల్లులను మొత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా తిరిగి వారికి చెల్లించాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎన్ఎస్యుఐ నాయకులతో కలిసి తాను ప్రజారోగ్య ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నట్టుగా పేర్కొన్నారు సీతక్క. ఇందిరా పార్క్ వద్ద ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొన్న సీతక్క దీక్ష ప్రాంగణంలోనే నిద్రించారు.
మండుటెండను లెక్కచెయ్యకుండా సీతక్క ఆమరణ దీక్ష
మండుటెండను సైతం లెక్కచేయకుండా ఆందోళనలో పాల్గొన్న సీతక్క పేద , మధ్య తరగతి ప్రజలు ఆసుపత్రులలో కరోనా వైద్యం చేయించుకోలేక పోతున్నారని, వారికి బాసటగా నిలవాల్సిన ప్రభుత్వాలు, సామాన్య ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవని మండిపడుతున్నారు. సామాన్యులందరికీ వైద్యం అందుబాటులో ఉండేలా ఆరోగ్య శ్రీలో కరోనా వైద్యాన్ని చేర్చాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఐరన్ లేడీ గా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే సీతక్క గతేడాది కరోనా మహమ్మారి పై స్పూర్తిదాయకమయిన పోరాటం సాగించారు.
పేదసాదల ఆరోగ్య రక్షణ కోసం కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్
మారుమూల గిరిజన ప్రాంతాలకు వెళ్లి కరోనా లాక్డౌన్ సమయంలో నిరుపేదల ఆకలి బాధలు తీర్చారు. గిరిజనులకు కరోనా మహమ్మారిపై అవగాహన కలిగించారు. అన్నార్థులకు బాసటగా నిలిచారు .ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అని అందరూ అనుకునేలా చేశారు. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకుని, గిరిజనులకు అండగా నిలిచి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు ఎమ్మెల్యే సీతక్క. ఇప్పుడు పేదసాదల ఆరోగ్య రక్షణ కోసం కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ దీక్షకు దిగారు .
ఆరోగ్యశ్రీలో కరోనా వైద్యం... ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ #Coronavirus #seethakkamla #Telangana pic.twitter.com/xuDGoYfGdf
— oneindiatelugu (@oneindiatelugu) April 26, 2021